Abhishek Sharma : పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ రెడీనా? ఓపెనర్ హెల్త్ అప్‌డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి

Abhishek Sharma : పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ రెడీనా? ఓపెనర్ హెల్త్ అప్‌డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి


Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్నా, అభిమానులను ఊరిస్తున్న అసలైన పోరు ఫిబ్రవరి 15న జరగనుంది. కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పొట్ట సంబంధిత అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమైన ఈ యువ హిట్టర్, పాక్ మ్యాచ్‌లో కనిపిస్తాడా లేదా అన్నదానిపై తాజాగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వరుణ్ చక్రవర్తి విలేకరులతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఆరోగ్యంపై సానుకూల సంకేతాలు ఇచ్చాడు. అమెరికాతో మ్యాచ్ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ఇప్పుడు డిశ్చార్జ్ అయి జట్టుతోనే ఉన్నాడు. “అభిషేక్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నేను అతనితో మాట్లాడాను, అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను” అని వరుణ్ వెల్లడించాడు. నమీబియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరచడం కూడా అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ఒకవైపు వరుణ్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. నమీబియా మ్యాచ్ టాస్ సమయంలో సూర్య మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ కోలుకోవడానికి మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు పట్టవచ్చని హింట్ ఇచ్చాడు. ఒకవేళ పాక్ మ్యాచ్ సమయానికి అభిషేక్ వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించకపోతే, అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంది. కొలంబో చేరుకున్న తర్వాత ఫిబ్రవరి 14న జరిగే తుది ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి అభిషేక్ భవితవ్యం తేలనుంది.

భారత్, పాకిస్థాన్ జట్లు రెండూ కూడా గ్రూప్ స్టేజ్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో జోరు మీదున్నాయి. ఫిబ్రవరి 15న జరిగే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా సూపర్-8 రౌండ్‌కు క్వాలిఫై అవుతుంది. నమీబియాపై గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత్, పాక్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఒకవేళ అభిషేక్ శర్మ తుది జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలం అమాంతం పెరుగుతుంది. పవర్‌ప్లేలో అతను ఆడే మెరుపు ఇన్నింగ్స్‌లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతాయనడంలో సందేహం లేదు.

అభిషేక్ శర్మ లేకపోయినా టీమిండియా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అతని రాక జట్టులో మరింత జోష్ నింపుతుంది. స్టమక్ బగ్ కారణంగా నీరసించిన అభిషేక్, కొలంబో పిచ్‌పై తన మార్క్ సిక్సర్లతో విరుచుకుపడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరి 15 ఆదివారం నాడు జరిగే ఈ మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాదు, రెండు దేశాల అభిమానుల ఎమోషన్. మరి ఈ పోరులో సూర్య సేన పాక్‌ను చిత్తు చేస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *