Lalit Modi and Vijay Mallya: మన దేశం నుంచి పారిపోయిన ఇద్దరు ప్రముఖులు లండన్లో పార్టీ చేసుకుంటున్నారు. IPLను ప్రారంభించిన లలిత్ మోదీ, బ్యాంకులను ముంచిన విజయ్ మాల్యా పాటలు పాడుతూ, ఓ సాయంత్రాన రిలాక్స్ అయ్యారు. అయితే, వీరిద్దరికి క్రికెటర్ క్రిస్ గేల్ జత కలిశారు. ఫ్రాంక్ సినాట్రా పాడిన ప్రసిద్ధ పాట “ఐ డిడ్ ఇట్ మై వే” ను కలిసి పాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్లోని బెల్గ్రేవియాలో మీరు చూస్తున్న ఈ విలాసవంతమైన భవనం లలిత్ మోదీ అని అంటున్నారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యా పార్టీ చేసుకుంటున్న వీడియోను వీరి మిత్రుడు క్రిస్ గేల్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ ముగ్గురికి మంచి ఫ్రెండ్స్ అంటున్నారు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీలో ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని, వారిలో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నారని లలిత్ మోడీ తెలిపారు. క్రిస్ గేల్ కూడా మోడీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పార్టీలో ఏం జరిగింది?
లలిత్ మోడీ తన వార్షిక వేసవి పార్టీని లండన్లోని తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో విజయ్ మాల్యా, క్రిస్ గేల్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీలో కారొకే సెషన్ జరిగింది. అందులో లలిత్ మోడీ, విజయ్ మాల్యా కలిసి ఫ్రాంక్ సినాట్రా “ఐ డిడ్ ఇట్ మై వే” పాటను ఉత్సాహంగా పాడారు. ఈ వీడియోలో వారిద్దరూ కలిసి నవ్వుతూ, పాట పాడుతూ కనిపించారు.
లలిత్ మోడీ కామెంట్:
ఈ వీడియోను షేర్ చేస్తూ లలిత్ మోడీ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. “ఈ వీడియో ఇంటర్నెట్ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా. కచ్చితంగా ఇది వివాదాస్పదమే. కానీ, నేను చేసేది అదే” అని పేర్కొన్నారు.
భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు వ్యక్తులు లండన్లో విలాసవంతమైన పార్టీలలో పాల్గొనడం, పాటలు పాడుతూ ఎంజాయ్ చేయడం ప్రజలలో చర్చకు, విమర్శలకు దారితీస్తోంది. ఇది న్యాయ వ్యవస్థపై, చట్టంపై వారి ధిక్కార వైఖరిని సూచిస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..