శ్రావణ శుక్రవారం సందర్భంగా ముందు రోజు రాత్రి నుండే గుంటూరులో మార్కెట్లు కిటకిట లాడాయి. పూలు, పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున స్థానికులు మార్కెట్లకు వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో పట్టాభిపురం రోడ్డు కూడా కిటకిటలాడుతోంది. బైక్పై దంపతులు వచ్చారు. తోపుడు బండిపై చిరు వ్యాపారి శనక్కాయలు అమ్ముతున్నాడు. అతని వద్ద నుండి వంద రూపాయలకు శనక్కాయలు కొనుగోలు చేశారు. ఇందుకుగాను ఐదు వందల రూపాయల నోటు ఇచ్చారు. ఆ చిరు వ్యాపారి నాలుగు వంద నోట్లు ఇవ్వడంతో అక్కడి నుండి ఆ జంట ముందుకు కదిలింది.
కొద్దీ దూరంలోనే ఉన్న బేకరీ వద్ద ఆగారు. అక్కడ కూల్ డ్రింగ్ కొనుగోలు చేశారు.అక్కడ కూడా ఐదు వందల రూపాయల నోటే ఇచ్చారు. తిరిగి చిల్లర తీసుకొని అక్కడ నుండి బయటకు వచ్చారు. అయితే నోటును పరిశీలించి చూసిన బైకరి నిర్వాహకుడికి అనుమానం వచ్చింది. వెంటనే కేకలు వేశాడు. ఆ దంపతులు షాపు లోపలికి వచ్చి ఐదు వందల రూపాయల నోటు వెనక్కి తీసుకొని వంద రూపాయల నోటు ఇచ్చారు. అయితే నిర్వాహకుడి కేకతలతో అప్రమత్తమైన స్థానికులు ఆ జంట చుట్టు ముట్టారు. ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కొంతమంది వెంటనే పట్టాభిపురం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ తంతగం నడుస్తుండగా దంపతులు వచ్చిన బైక్ పై ఉన్న బ్యాగ్ తీసుకొని మరొక వ్యక్తి పరారయ్యాడు.
దీంతో ఆ జంటపై మరింతగా అనుమానాలు బలపడ్డాయి. దొంగ నోట్లు మారుస్తున్న ముఠాగా భావించారు. ఈ లోపే పోలీసులు వచ్చారు. ఆ జంటను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారు గుంటూరులోని రత్నగిరి కాలనీలో ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నట్లు చెప్పారు. ఆ ఇంటిలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ దంపతులు చెబుతున్న మాటల్లో వాస్తవాలు లేవని గుర్తించారు. హైదరాబాద్ లో కన్సల్టెన్సీ ఉన్నట్లు మొదట చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వారిది అసలు హైదరాబాదే కాదని పోలీసుల విచారణలో తేలింది. మొత్తం మీద పోలీసులు దంపతుల వ్యవహార శైలిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి