శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. పుట్టపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్లో సాయి మంజునాథ ఫ్యాన్సీ స్టోర్ను ఉస్మాంబా అనే వృద్ధురాలు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాన్సీ స్టోర్కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు స్కూటీలో ఉండగా.. ఒక వ్యక్తి మాత్రం వస్తువులు కొనడానికి స్టోర్లోకి వెళ్ళాడు. స్టోర్లో ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్న వ్యక్తి వృద్ధురాలిని మాయమాటలతో మోసగించాడు. రెప్పపాటున మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ను బలవంతంగా కాకుండా మభ్యపెట్టి ఎత్తుకెళ్లాడు.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బంగారు చైన్ను తీసి ఇవ్వమని.. ఇది పేపర్లో పెట్టి క్యాష్ బాక్స్లో వేస్తే మీకు మంచి జరుగుతుంది. బంగారంతో పాటు డబ్బు రెండింతలు అవుతుంది అంటూ వృద్ధురాలిని నమ్మించాడు. అతడి మాయమాటలను నమ్మిన ఆమె తన చైన్ తీసి పేపర్లో పెట్టి ఇచ్చింది. తన వద్ద పెట్టుకున్న పేపర్ని క్యాష్ బాక్స్లో పెట్టి ఆమె ఇచ్చిన పేపర్ని జేబులో పెట్టుకున్నాడు. ఆపై దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వృద్ధురాలు పేపర్ను ఓపెన్ చేసి చూస్తే బంగారు చైన్ లేకపోవడంతో దిగ్భ్రాంతికి గురైంది.
మోసపోయానని గుర్తించిన ఆమె కన్నీరు మున్నీరవుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయ్యో.! ఎంత పని జరిగింది దేవుడా.. అంటూ ఆమె ఆర్తనాదాలు, బాధను చూసి స్థానికులు చలించిపోయారు. ఈ సంఘటనతో పుట్టపర్తి పట్టణంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దుండగుల దూకుడుతో మహిళలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి క్వార్టర్స్లో ఒకే రోజు దొంగలు పది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.
ఆ ఉదంతం మరువక ముందే బంగారు గొలుసు అపహరించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చైన్ స్నాచర్ను త్వరగా పట్టుకోవడంతో పాటు చోరీలకు అడ్డుకట్టు వేయాలని బాధితులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు. బాధితురాలు ఉస్మాంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పుట్టపర్తి అర్బన్ పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి