బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హ్యుమా ఖురేషి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటి సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు.ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగినట్లు తెలిసింది. హుమా సోదరుడు ఆసిఫ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం (ఆగస్టు 7) రాత్రి 11 గంటల ప్రాంతంలో నిజాముద్దీన్ లోని జంగ్పూర్ భోగల్ బజార్ లేన్ లో ఈ హత్య జరిగింది. ఆసిఫ్ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశారు. దీంతో వాహనాలను తొలగించాలని ఆసిఫ్ కోరడంతో వారిద్దరూ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్ పై దాడి చేశారు. దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆసిఫ్ భార్య మాట్లాడుతూ.. ‘ మా ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. పక్కింటి వారి స్కూటర్ మా ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. స్కూటర్ ను తీయాలని వేరే చోట పార్క్ చేయమని మా ఆయన అడిగారు. కానీ వారు నా భర్తను దుర్భాషలాడడం ప్రారంభించారు. ఆ తర్వాత గొడవకు దిగారు. దాడిలో నా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. మేము అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు’ అని కన్నీరు మున్నీరవుతోంది.
ఈ సంఘటనై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేశారు. ఈ గొడవ పార్కింగ్ సమస్య కారణంగా జరిగిందా లేదా వారి మధ్య పాత శత్రుత్వమా అని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా పోలీసులను మోహరించారు.
ఆసిఫ్ ఖురేషి హుమా ఖురేషి బంధువు అవుతాడు. హుమా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. 2012 రిలీజైన ‘గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్’ హ్యూమాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘బద్లాపూర్’ , ‘హైవే’, జాలీ ఎల్ఎల్బీ 2 తదితర సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది. అలాగే దక్షిణాదిలో రజనీకాంత్ కాలా, అజిత్ కుమార్ వలిమై చిత్రాల్లోనూ కథానాయికగా కనిపించింది.