Kolhapur Elephant: జంతువులపై కూడా మనుషులు మానత్వం చూపిస్తారని ఈ సంఘటన ద్వారా తెలిసిపోతుంది. ఒక్క ఏనుగు కొరకు వందలాది మంది పోరాటం చేయడం మనుషులకు జంతువులపై ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. జంతు సంక్షేమం, సంప్రదాయాల మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మహారాష్ట్రలోని కోల్హాపూర్లో భారీ నిరసనలకు దారితీసింది.
ఏనుగు కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా దాదాపు 30 వేల మంది పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఏనుగును వంటారాకు తరలించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాధురి/మహాదేవి పేరుతో పిలిచే ఏనుగును కొల్హాపూర్లోని నందాని గ్రామానికి తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టు (SC)లో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.
మహాదేవి, మాధురి పేరుతో పిలిచే ఏనుగును గుజరాత్లోని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు ఒక భారీ మౌన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రాజు శెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో 30 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మహాదేవిని తిరిగి తమ ప్రాంతానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి కోల్హాపూర్ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఒక్క ఏనుగు కోసం ప్రజలు ఇంతటి పోరాటం చేస్తున్నారంటే ఆ ఏనుగుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
అసలు విషయం ఏంటి?
మహాదేవి అలియాస్ మాధురి అనే 36 ఏళ్ల ఏనుగు గత 3 దశాబ్దాలుగా కోల్హాపూర్లోని జైన మఠంలోనే నివసిస్తోంది. మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొనేది. స్థానిక ప్రజలకు, ఆలయ అర్చకులకు ముఖ్యంగా జైనులకు ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. చాలా మంది తమకు వీలునప్పుడల్లా ఆలయానికి వెళ్లి మహాదేవికి స్నానం చేయించడం, మంచి ఫుడ్ పెట్టడం, దాని బాగోగులు చూసుకోవడవం చేసేవారు. ఇలా వారిలో ఒకరిగా ఈ ఏనుగు కలిసిపోయింది. అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావడంతో PETA (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్) అధికారులు దీనిపై దృష్టి సారించారు.
ఈ ఏనుగు అనారోగ్యంతో బాధ పడుతుందని, సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతారాకు తరలించారు. వంతారా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ఏనుగును అక్కడికి తరలించడంతో అర్చకులు, స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏనుగును తరలించే సమయంలో ప్రజలు బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి.
అనంత్ అంబానీకి మహాదేవి ఏనుగు నచ్చిందని, అందుకే దాన్ని తీసుకుని వెళ్లారని.. దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్థానిక ప్రజలు చెబుతున్నారు. తీసుకెళ్లిన ఏనుగును తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
రిలయన్స్ జియోను బహిష్కరిస్తాం:
ఇదిలా ఉండగా, తీసుకెళ్లిన ఏనుగును తిరిగి అప్పగించాలని, లేకుంటే రిలయన్స్ జయోను బహిష్కరిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఏనుగును తీసుకెళ్లేటప్పుడు మహాదేవి కూడా కన్నీళ్లు పెట్టుకుందని వారు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి