MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. ఇది ఒక పేరు కాదు, కోట్లాది మంది క్రికెట్ అభిమానుల భావోద్వేగం. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనా, ఐపీఎల్లో మాత్రం ధోని ఆటా, అతని కెప్టెన్సీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే ధోని, ధోని అంటే CSK అని చెప్పవచ్చు. ఈ జట్టును అతను ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపాడు. అయితే, గత రెండు సీజన్లలో CSK ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ధోని తన రిటైర్మెంట్ గురించి కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడారు.
చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ గత రెండు సీజన్లలో చెన్నై జట్టు అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయిందని అంగీకరించాడు. “గత రెండు సంవత్సరాలు మాకు అంత మంచిగా లేవు. మా ప్రదర్శన అంతగా లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలి. గతేడాది కూడా ఇదే ప్రశ్న మాకు ఎదురైంది” అని ధోని అన్నాడు.
తమ జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. “మేము గత సీజన్లో వెనకబడ్డాం అని చెప్పను. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. డిసెంబర్లో చిన్న వేలం రాబోతోంది. ఆ వేలంలో ఆ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తాం” అని ధోని పేర్కొన్నాడు. జట్టును మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, తదుపరి సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ధోని, సీఎస్కేతో తనకున్న సుదీర్ఘ సంబంధం గురించి కూడా మాట్లాడాడు. “మా మధ్య ఉన్న బంధం చాలా కాలం నాటిది. ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే ఈ బంధం మొదలైంది. 2005లో నేను నా టెస్ట్ అరంగేట్రం చెన్నైలోనే చేశాను. అప్పటి నుంచి ఈ అనుబంధం మొదలైంది. సీఎస్కే నాకు చాలా సాయం చేసింది, ఎందుకంటే నేను ఇక్కడ 45-50 రోజులు గడిపాను. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సంబంధం మరింత పెరిగింది. ఇది ఒక క్రికెటర్గా, వ్యక్తిగా నేను ఎదగడానికి సహాయపడింది. ఇప్పుడు సీఎస్కే అనేది ఒక బ్రాండ్ భారతదేశంలోనే కాదు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి క్రికెట్ ఆడే దేశాల్లో కూడా” అని ధోని వివరించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..