
తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సీవీ అండ్ ఎస్వో శ్రీ మురళీకృష్ణ విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. దీంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాదు బ్రహ్మోత్సవాల సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని చెప్పారు. బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..