IPL 2026: క్రికెట్ లాంటి కఠినమైన క్రీడల్లో గాయాలు అనేవి ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్లు, ఐసీసీ టోర్నమెంట్లకు గాయాల కారణంగా దూరమవుతున్నారు. కానీ ఐపీఎల్ (IPL) సీజన్ మొదలవుతుందంటే మాత్రం అదే ఆటగాళ్లు హఠాత్తుగా ఫిట్గా మారడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. 2026లో కూడా ఇలాగే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని పెద్ద పేర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో లేకపోయినా, ఐపీఎల్ మొదటి మ్యాచ్ నుంచే మళ్లీ ఫీల్డ్లో దిగే అవకాశం ఉందన్న వార్తలు ఫ్యాన్స్కు ఉత్సాహంగా చేస్తుంటాయి.
ఐపీఎల్ 2026కి ముందే గాయపడిన జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్..
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన స్టార్ పేసర్లు జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం జాతీయ జట్టు నుంచి దూరంగా ఉన్నారు. హేజిల్వుడ్ హ్యామ్స్ట్రింగ్, అకిలీస్ గాయాల కారణంగా యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి కీలక టోర్నీలను మిస్ అయ్యాడు.
అలాగే, పాట్ కమిన్స్ వెన్నునొప్పి సమస్యతో అంతర్జాతీయ సీజన్కు దూరమయ్యాడు. అయితే ఆర్సీబీ (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఐపీఎల్ 2026 నాటికి వీరిద్దరూ పూర్తిగా ఫిట్ అవుతారని సంకేతాలు ఇచ్చారు.
కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో “ఐపీఎల్ వస్తే గాయాలు మాయం” అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే, ప్రతి ఆస్ట్రేలియన్ ఆటగాడికీ ఇదే వర్తించదు. మిచెల్ స్టార్క్ లాంటి ఆటగాడు గతంలో ఐపీఎల్ను కూడా వదిలేసిన సందర్భాలున్నాయి.
రిషభ్ పంత్, మతీషా పతిరణ కూడా..
భారత వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ గాయాల కారణంగా కొన్ని అంతర్జాతీయ సిరీస్లకు దూరమయ్యాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజా రిపోర్టుల ప్రకారం ఆయన రికవరీ వేగంగా సాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్గా ఐపీఎల్ లో తిరిగి ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక శ్రీలంక యువ పేసర్, ‘బేబీ మలింగా’గా పేరు పొందిన మతీషా పతిరణ టీ20 వరల్డ్ కప్ సమయంలో గాయపడ్డాడు. ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అతనిపై భారీగా రూ.18 కోట్ల బిడ్ వేసింది. జాతీయ జట్టు నుంచి బ్రేక్ తీసుకుని నేరుగా ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడని వార్తలు చెబుతున్నాయి. సీజన్ మొదలయ్యేలోపు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆటగాళ్లంతా ఐపీఎల్ కే ప్రాధాన్యత ఇస్తున్నారా..?
ఐపీఎల్ కోసం ఆటగాళ్లు తమ జాతీయ డ్యూటీలను పక్కన పెడుతున్నారా అనే చర్చ ఏళ్లుగా కొనసాగుతోంది. సాయి సుదర్శన్ లాంటి యువ ఆటగాడు గాయంతో జాతీయ జట్టు నుంచి బయటపడినా, ప్రస్తుతం శుభ్మన్ గిల్తో కలిసి ట్రైనింగ్ చేస్తూ కనిపించడం ఈ చర్చకు మరింత బలం ఇస్తోంది.
కోట్ల రూపాయల కాంట్రాక్టులు, గ్లామర్ ఉన్నప్పుడు ఆటగాళ్ల రికవరీ వేగం రెట్టింపు అవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా “వర్క్లోడ్ సమస్య ఉంటే దేశం తరపున ఆడే మ్యాచ్లను వదిలేయకుండా ఐపీఎల్ను మిస్ అవ్వాలి” అని వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..