హైదరాబాద్ మహానగరంలో మరో భారీ ఆన్లైన్ పెట్టుబడి మోసం వెలుగు చూసింది. రూ.7 కోట్ల లాభం వస్తుందని నమ్మబలికి.. 35 ఏళ్ల వ్యక్తి నుంచి మోసగాళ్లు రూ.36.30 లక్షలు కాజేశారు. ఈ ఘటన మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జనవరి 30న బాధితుడిని “Barclays” పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ట్రేడింగ్ టిప్స్, లాభాల స్క్రీన్ షాట్లు, సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అంటూ ఫేక్ డాక్యూమెంట్స్ షేర్ చేస్తూ నమ్మకం కల్పించారు. సాన్య అనే పేరుతో ఒకరు ట్రేడర్గా పరిచయమై బాధితుడిని సంప్రదించారు. ట్రేడింగ్ వెబ్సైట్ల లింకులు పంపిస్తూ పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. మొదటగా రూ.50 వేల పెట్టుబడి పెట్టగా కొంత లాభం వచ్చినట్లు చూపించారు. దీంతో బాధితుడు మరింత నమ్మకం పెంచుకుని ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్, ఐపీవోలలో పెట్టుబడులు పెట్టాడు. కొద్ది రోజుల్లోనే వెబ్సైట్లో రూ.7 కోట్ల లాభం వచ్చినట్లు చూపించింది.
అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అదే సమయంలో మోసగాళ్లు లాభంలో 2 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదులో మొత్తం 12 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.36,35,010 పెట్టుబడి పెట్టినట్లు, తిరిగి కేవలం రూ.5 వేలు అందినట్లు తెలిపాడు. దీంతో అతనికి రూ.36,30,010 నష్టం వాటిల్లింది. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అపరిచిత వాట్సాప్ గ్రూప్లలో పెట్టుబడుల ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అంటూ పంపే పత్రాలను అధికారిక వెబ్సైట్లో ధృవీకరించుకోవాలంటున్నారు. అధిక లాభాల ఆశ చూపే పథకాలపై సందేహం ఉంటే వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..