ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు కే. విశ్వనాథ్ ల అనుబంధం గురించి నటుడు ఎడిద శ్రీరామ్ కొన్ని అపురూపమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా సాగర సంగమం చిత్రం తెరకెనుక కథలు, స్వాతిముత్యం చిత్రంలోని సంఘటనలను వివరించారు. కే. విశ్వనాథ్ తన సినిమాల్లో పాటల ఎంపిక, సంభాషణల రూపకల్పనలో ఎంతో నిబద్ధతతో ఉండేవారని శ్రీరామ్ వెల్లడించారు. పాటల విషయంలో, ముందుగా సంగీత దర్శకుడితో, రచయితలతో కలిసి పరిస్థితిని వివరించేవారు. ఏ సందర్భంలో పాట వస్తుంది, ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై చర్చలు జరిపేవారు. విశ్వనాథ్ స్వయంగా పదాలను కూడా మార్చేవారని, సలహాలతో మెరుగుపరిచేవారని పేర్కొన్నారు.
స్వాతిముత్యం చిత్రంలోని ఒక ఆసక్తికరమైన సంఘటనను శ్రీరామ్ వివరించారు. సినిమాలో దీప స్నానం చేస్తూ పాట పాడే సన్నివేశం తరువాత, కమల్ హాసన్ ప్రవేశించే సీన్ ఫ్లాట్గా ఉందని విశ్వనాథ్ భావించారు. అప్పటికప్పుడు ఒక చిన్న ఫోక్ పాటను జోడించాలని నిర్ణయించారు. రాజమండ్రిలో అవుట్డోర్ షూటింగ్ జరుగుతుండగా, ఉదయం తొమ్మిది గంటలకు సెట్కి వచ్చే కమల్ హాసన్తో విశ్వనాథ్ ఈ విషయం చర్చించారు. రికార్డింగ్కి సమయం లేకపోవడంతో, కమల్ హాసన్ స్వయంగా నాయగారాలోని టేప్లో మగ, ఆడ గొంతులతో ఆ పాటను పాడారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, రీ-రికార్డింగ్ సమయంలో ఇళయరాజా ఈ తాత్కాలిక పాటను విని ఆశ్చర్యపోయారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, శైలజతో పాడించి, అసలు పాటను సిద్ధం చేయించారు.
కమల్ హాసన్ ముందుగా సాగర సంగమం సినిమాలో ఆ పాత్రను చేయడానికి సందేహపడ్డారని శ్రీరామ్ అన్నారు.. శాస్త్రీయ నృత్యకారుడి పాత్రకు కమల్ హాసన్ ఒక్కరే సరైన వ్యక్తి అని విశ్వనాథ్ దృఢంగా నమ్మారని.. అయితే, కథ విన్న తర్వాత, సినిమాలో వృద్ధ గెటప్ ఉందని కమల్ హాసన్ గమనించారు. గతంలో తమిళంలో కడల్ మీన్గళ్ అనే సినిమాలో వృద్ధ గెటప్ వేసి సినిమా ఫ్లాప్ అవ్వడంతో, గ్లామర్ హీరోగా ఉన్న తనను వృద్ధ పాత్రలో ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే భయం కమల్ హాసన్కు ఉండేదని గుర్తుచేశారు. చేయాలనే తపన ఒకవైపు, భయం మరోవైపు ఉండగా.. నాలుగైదు చర్చల తర్వాత, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుని, చిత్రాన్ని చేయడానికి అంగీకరించారు. వారిద్దరి ఆలోచనలు, తరంగాలు చాలా దగ్గరగా ఉండేవని శ్రీరామ్ తెలిపారు.