
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఫార్మా కంపెనీల్లో వరస పేలుళ్లు భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పేలుడు ఘటన మరువక ముందే, మరో దారుణం చోటు చేసుకుంది. సరిగ్గా వారం రోజులక్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా బృందావన్ కంపెనీలో ఓ రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. తాజాగా ఎల్లగిరి గ్రామానికి పొరుగున ఉన్న భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
VJ సాయి కెమికల్ ల్యాబ్లో మరో పేలుడు జరిగింది. డ్రమ్ములో కెమికల్ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కెమికల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఎగిసిపడుతున్న మంటలు, కెమికల్ డ్రమ్ములు ఉండడంతో పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు ధాటికి కంపెనీ నుండి కెమికల్ ద్రావకం బయటకు ప్రవహిస్తోంది. భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలి బూడిదయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా పుటేజీ ప్రమాద తీవ్రత ఎంత భయానకంగా ఉందో తెలియజేస్తుంది. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..