T20 World Cup 2026 Super 8 : టీమిండియాకు సూపర్-8 గండం.. 17 ఏళ్ల నాటి ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవుతుందా?

T20 World Cup 2026 Super 8 : టీమిండియాకు సూపర్-8 గండం.. 17 ఏళ్ల నాటి ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవుతుందా?


T20 World Cup 2026 Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన అసలు సిసలైన సమరం మొదలైంది. గ్రూప్ స్టేజ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా, ఇప్పుడు సూపర్-8 గండం దాటాల్సి ఉంది. అయితే ఈసారి పరిస్థితులు చూస్తుంటే భారత అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సుమారు 17 ఏళ్ల క్రితం నాటి ఒక చేదు జ్ఞాపకం ఇప్పుడు మళ్ళీ టీమిండియాను భయపెడుతోంది. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒకే గ్రూపులో చేరడం టీమిండియాకు అతిపెద్ద ముప్పుగా పరిణమించింది.

ఏమిటా 17 ఏళ్ల నాటి బ్యాడ్ సెంటిమెంట్?

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సూపర్-8లో ఒకే గ్రూపులో ఉండటం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2009 వరల్డ్ కప్‌లో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పట్లో భారత్‌తో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్ చేతిలో 7 వికెట్లతో, సౌతాఫ్రికా చేతిలో 12 పరుగులతో, ఇంగ్లాండ్ చేతిలో 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్ళీ అదే ఈక్వేషన్ రిపీట్ అవ్వడం అభిమానులను కలవరపెడుతోంది.

గ్రూప్ ఆఫ్ డెత్.. అందరూ అజేయులే!

ఈసారి సూపర్-8 గ్రూప్-1ని గ్రూప్ ఆఫ్ డెత్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లు (భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే) గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్-బీటన్‎గా ఇక్కడికి చేరుకున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి జింబాబ్వే రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టు.. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజ జట్లనే మట్టికరిపించి అజేయులుగా సూపర్-8లోకి దూసుకొచ్చింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జింబాబ్వే పెద్ద జట్ల కొంపముంచడం ఖాయం.

సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై

సూపర్-8లో ప్రతి జట్టు కేవలం మూడు మ్యాచ్‌లే ఆడుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన వారు మాత్రమే సెమీఫైనల్‌కు వెళ్తారు. కాబట్టి భారత్‌కు ఇక్కడ ఒక్క ఓటమి ఎదురైనా సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి.

ఫిబ్రవరి 22: అహ్మదాబాద్‌లో బలమైన సౌతాఫ్రికాతో తొలి పోరు.

ఫిబ్రవరి 26: చెన్నై వేదికగా డేంజర్ జింబాబ్వేతో రెండో మ్యాచ్.

మార్చి 1: కోల్‌కతాలో పవర్‌ఫుల్ వెస్టిండీస్‌తో ఆఖరి పోరు.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, 17 ఏళ్ల నాటి ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి.. ఈ డెత్ గ్రూప్ నుంచి విజయవంతంగా బయటపడుతుందా లేదా అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *