AP News: రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

AP News: రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!


కర్నూలు, ఫిబ్రవరి 20: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత కుటుంబానికి రికార్డు స్థాయిలో పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కర్నూలు కోర్టు ఆదేశించింది. కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి 2022 ఏప్రిల్ 20న హైదరాబాదు నుంచి కర్నూలుకు ఫార్చ్యూనర్ కారులో వస్తుండగా మహబూబ్నగర్ జిల్లాలోని ఉండవల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పులకుర్తి సౌజన్య, తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

రాజ వర్ధన్ రెడ్డి భార్య పిల్లలు తమ సీనియర్ న్యాయవాది ML శ్రీనివాసరెడ్డి ద్వారా కర్నూలు జిల్లా కోర్టులో నష్టపరిహారం కోసం కేసు దాఖలు చేశారు. సదరు కారుకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయించి ఉండటంతో వారు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు సాక్ష్యధారాలు పరిశీలించి మృతుడి వయస్సు, ఆదాయము, విద్యార్హతలు కుటుంబీకుల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఆ కంపెనీ మృతుని కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

పిటిషనర్లైన మృతుని కుటుంబ సభ్యులకు రూ.2.2 కోట్లు తోపాటు 7.5 శాతం వడ్డీతో సహా మొత్తం రూ.2.95 కోట్లు చెల్లించాలని ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు. ఇంత మొత్తంలో పరిహారం రావడం పట్ల మృతుడు రాజ వర్ధన్ రెడ్డి కుటుంబీకులు తమ న్యాయవాది ఎంఎల్ శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించమని ఒక భీమా కంపెనీకి కోర్టు ఆదేశించలేదని, ఇదే ప్రధమమని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *