T20 World Cup 2026 : ముగ్గురు కెప్టెన్లు.. ఒకే వ్యూహం.. భారత ఓపెనర్ల బలహీనతను పట్టేసేందుకు 34 ఏళ్ల నాటి ప్లాన్

T20 World Cup 2026  : ముగ్గురు కెప్టెన్లు.. ఒకే వ్యూహం.. భారత ఓపెనర్ల బలహీనతను పట్టేసేందుకు 34 ఏళ్ల నాటి ప్లాన్


T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ అభిమానుల్లో ఒక తెలియని భయం మొదలైంది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా వంటి జట్లు భారత్‌పై ఒకే రకమైన వ్యూహాన్ని ప్రయోగించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ ఈనాటిది కాదు, ఏకంగా 34 ఏళ్ల క్రితం నాటిది. 1992 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో ప్రయోగించిన ఈ ఆఫ్ స్పిన్ అస్త్రంలో ఇప్పుడు మన కుర్రాళ్ళు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ చిక్కుకుపోతున్నారు. సూపర్-8లో కూడా ఇదే రిపీట్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

ఏమిటా 34 ఏళ్ల నాటి ప్లాన్?

1992 వరల్డ్ కప్‌లో అప్పటి న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రో ఒక వింత ప్రయోగం చేశారు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లతో ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఆనవాయితీని కాదని, ఆఫ్ స్పిన్నర్ దీపక్ పటేల్‌తో బౌలింగ్ చేయించారు. ఈ సర్ప్రైజ్ అటాక్ అప్పట్లో ఆస్ట్రేలియా, భారత్ వంటి జట్లను బెంబేలెత్తించింది. ఇప్పుడు సరిగ్గా 34 ఏళ్ల తర్వాత, 2026 టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లు మళ్ళీ అదే వ్యూహాన్ని దుమ్ముదులిపి బయటకు తీశాయి.

ఇషాన్, అభిషేక్.. ఎందుకు దొరికిపోతున్నారు?

భారత టాప్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. క్రికెట్ లాజిక్ ప్రకారం.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆడటం కొంచెం కష్టమైన పని. బంతి వికెట్ల అవతలి నుంచి లోపలికి తిరగడం వల్ల వారు షాట్లు ఆడటానికి ఇబ్బంది పడుతున్నారు. గ్రూప్ స్టేజ్ గణాంకాలు చూస్తే.. భారత్ కోల్పోయిన మొత్తం 31 వికెట్లలో దాదాపు మూడో వంతు (11 వికెట్లు) కేవలం ఆఫ్ స్పిన్నర్లకే దక్కడం గమనార్హం.

వికెట్లు తీసిన జట్లు ఇవే..

పాకిస్థాన్: కెప్టెన్ సల్మాన్ ఆగా స్వయంగా ఆఫ్ స్పిన్‌తో మొదటి ఓవర్ వేసి అభిషేక్ శర్మను అవుట్ చేశాడు.

నెదర్లాండ్స్: ఆర్యన్ దత్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్‌ను బోల్తా కొట్టించడమే కాకుండా, ఇషాన్ కిషన్‌ను కూడా పెవిలియన్ పంపాడు.

నమీబియా: ఆ జట్టు కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తన ఆఫ్ స్పిన్‌తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను వణికించాడు.

సూపర్-8లో అసలు సవాల్

గ్రూప్ స్టేజ్ ముగిసింది కానీ, అసలు ముప్పు సూపర్-8లో ఉంది. ఇక్కడ భారత్ తలపడబోయే జట్లలో మేటి ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు. సౌతాఫ్రికాలో ఎయిడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్.. జింబాబ్వేలో సికిందర్ రజా, బ్రయాన్ బెన్నెట్.. వెస్టిండీస్‌లో రోస్టన్ చేజ్ వంటి వారు భారత్‌ను టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొలంబోలోని స్లో పిచ్‌లపై ఈ ఫింగర్ స్పిన్ మరింత ప్రమాదకరంగా మారుతుందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోస్చాటే కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ పాత ప్లాన్‌కు మన ఓపెనర్లు కొత్త విరుగుడు కనిపెడతారో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *