ఇండియాలో రైలు ప్రయాణం చేసిన ఓ ఇంటర్నేషనల్ ట్రావెలర్ తన అనుభవాన్ని పంచుకుంటూ భారతీయ రైల్వే భోజనంపై ప్రశంసలు కురిపించాడు. ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూ తనకు అందించిన భోజనాన్ని రివ్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అతను ఫుడ్ ట్రే తెరిచి ఒక్కో ఐటమ్ను పరిశీలిస్తూ కనిపించాడు. ప్రయాణంలో ఇంత సంపూర్ణ భోజనం అందిస్తారని తాను అసలు ఊహించలేదని చెప్పాడు. “ఇండియన్ ట్రైన్స్లో భోజనం ఇస్తారని నాకు తెలియదు. ఇందులో ఏముందో చూద్దాం అంటూ వీడియోలో పేర్కొన్నాడు.
ట్రేలో అన్నం, పప్పు, మటర్ పనీర్, రోటీ, ఊరగాయ, పెరుగు, రసమలైతో పాటు వేడి టవల్ కూడా ఉండటాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. రోటీతో కూర రుచి చూసిన తర్వాత ఇది నిజంగా బాగుంది అని ప్రశంసించాడు. స్వీట్ను గుర్తుపట్టేందుకు అతనికి కాస్త టైమ్ పట్టింది. తన పోస్టు క్యాప్షన్లో “భారతీయ రైలు భోజనానికి చెడ్డ పేరు ఉందని విన్నాను. కానీ ఈ మిక్స్డ్ థాలీ నిజంగా తాజాగా, రుచిగా ఉంది” అని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 16న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 70 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.
వీడియోపై అనేక మంది వినియోగదారులు స్పందించారు. భారతదేశంలో రైలు ప్రయాణంలో మంచి భోజనం ఒక ముఖ్య భాగమని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు అతను పనీర్ను చికెన్గా భావించిన విషయాన్ని సరదాగా కరెక్ట్ చేశారు. ఇదే తరహాలో 2025 నవంబర్లో ఒక ఆస్ట్రేలియన్ మహిళ కూడా కదులుతున్న రైలులో పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ తన సీటుకే డెలివరీ కావడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి