తెలంగాణ ప్రజలకు శుభవార్త. నగరంలో ఇప్పటికే సనత్ నగర్ టిమ్స్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ హాస్పిటల్ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పేదలకు ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సర్జరీలు కూడా ఉచితంగా చేయనున్నారు. ఇందుకోసం అనేక ఆపరేషన్ థియేటర్లు కూడా ఈ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ల్యాబ్ టెస్టులు కూడా ఉచితంగా చేయించుకోవచ్చు. ఇక సనత్ నగర్ టిమ్స్తో పాటు నగరంలో మరో రెండు ఆస్పత్రులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వీటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అల్వాల్ టిమ్స్ పనులు వేగవంతం
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్లో మరో టిమ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.1,196 కోట్లతో ఈ కొత్త ఆస్పత్రి నిర్మిస్తుండగా.. 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఇందులో వెయ్యికిపైగా పడకలు పేషెంట్లకు అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెలలో ఈ హాస్పిటల్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 28 ఎకరాల్లో దీనిని నిర్మించారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. విద్యుత్, ప్లంబింగ్ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. త్వరలో ఈ పనులన్నీ పూర్తి కానున్నాయి. ఈ రెండు అందుబాటులోకి వస్తే ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉచితంగా అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. అటు ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
21 ఎకరాల్లో ఎల్బీ నగర్ టిమ్స్
ఇక ఎల్బీ నగర్లో 21 ఎకరాల్లో టిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.1,011 వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇక సనత్ నగర్ టిమ్స్ రూ.968 కోట్లతో నిర్మాణం చేపట్టారు. 53 ఎకరాల్లో ఇది నిర్మాణమైంది. ఇందులో 16 ఆపరేషన్ థియేటర్లతో పాటు పేషెంట్లు, వారి సహయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. నిమ్స్ వైద్యులను కొంతమందిని ఇక్కడికి బదిలీ చేయనున్నారు. త్వరలోనే సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ అందుబాటులోకి వస్తుండటంతో నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎల్బీ నగర్ టిమ్స్ కూడా పూరైతే శివారు నగర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం వీటిని నిర్మిస్తోంది. వీటి రాకతో తెలంగాణలో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందనున్నాయి.