
IND vs NED: టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-ఏ ఆఖరి పోరులో టీమిండియా విజయఢంకా మోగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్పై భారత్ ఘనవిజయం సాధించింది. శివం దూబే సిక్సర్ల సునామీకి తోడు బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవ్వడంతో, పసికూన నెదర్లాండ్స్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు మోకరిల్లింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్లో అజేయంగా నిలిచి, పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్-8 రౌండ్లోకి అడుగుపెట్టింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివం దూబే కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (30), సూర్యకుమార్ యాదవ్ (34) కూడా విలువైన పరుగులు జోడించారు. అయితే, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.