Andhra: ఊయలే ఉరితాడైందా.. లేక మరేమైనా జరిగిందా..? చిన్నారి మృతి కేసులో మిస్టరీ..

Andhra: ఊయలే ఉరితాడైందా.. లేక మరేమైనా జరిగిందా..? చిన్నారి మృతి కేసులో మిస్టరీ..


అప్పటివరకు అల్లరిచేస్తూ ఆడుకుంటున్న ఏడేళ్ళ చిన్నారి మెడకు.. ఊయల ఉరితాడుగా మారి ఉసురుతీసింది. తల్లి చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటూ అదేచీర మెడకు చుట్టుకుంది.. చూస్తుండగానే.. అపస్మారక స్థితికి వెళ్లిన చిన్నారి.. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన మార్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఊయలే ఉరితాడుగా మారి ఉసురుతీయడంతో.. ఆ చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది.

మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో సునంద భాగ్యలక్ష్మి (7) అనే చిన్నారి చీరతో వేసిన ఊయలలో ఆడుకుంటోంది. ఈక్రమంలో బాలిక మెడకు చీరతో వేసిన ఊయల చుట్టుకుంది. ఆ తర్వాత చిన్నారి ఊపిరాడక క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో ఆడుకుంటుండగా ఊయలలో చిన్నారి తల చిక్కుకుని ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే తల్లితండ్రులు చెబుతున్న సమాధానాలతో పోలీసులు అనుమానంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *