ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో రెజీనా కసాండ్రా ఓ వెలుగు వెలిగింది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా.. టైర్-2 హీరోలైన రవితేజ, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, సందీప్ కిషన్ వంటి వారితో జతకట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ చేస్తూ దక్షిణాదిలో తనకంటూ ఒక బలమైన పునాది వేసుకుంది. అయితే, కెరీర్ పీక్లో ఉన్నప్పుడే కొత్తదనం కోసం ఇతర పరిశ్రమల వైపు చూడటం సహజం. సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ మీద ఉండే క్రేజ్ తెలిసిందే.
ఆ మోజులోనే రెజీనా కూడా ఉత్తరాదిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బడా స్టార్స్ ఉన్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు, చిన్న సినిమాల్లో మెరిసినా, దక్షిణాదిలో ఆమెకు దక్కినంత గుర్తింపు కానీ, స్టార్ డమ్ కానీ అక్కడ దక్కలేదు. కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు బాలీవుడ్ మేకర్స్. సినిమాల జయాపజయాలు పక్కన పెడితే, ముంబైలో తనకు ఎదురైన అనుభవాలు చాలా చేదుగా ఉన్నాయని రెజీనా ఇటీవల ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది. ముఖ్యంగా దక్షిణాది నుంచి వచ్చిన నటీమణుల పట్ల అక్కడి వారి దృక్పథం భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.
అక్కడి వాళ్ల మాటల్లో, ప్రవర్తనలో ఒక రకమైన వివక్ష స్పష్టంగా కనిపించేదని.. దక్షిణాది నటులు అంటే ఒక రకమైన చిన్నచూపు ఉండేదని ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది. బాలీవుడ్ వాతావరణం తనకు ఏమాత్రం సౌకర్యవంతంగా అనిపించలేదని.. అక్కడ పని చేయడం ఒక ఇబ్బందికరమైన అంశంగా మారిపోయిందని రెజీనా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంకుచిత వాతావరణం కారణంగా అక్కడ సినిమాలు చేయాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చిందని పేర్కొంది. మన సౌత్లో హీరోయిన్లకు ఉండే ఫ్రీడమ్ అక్కడ ఉండదని ఓపెన్గానే చెప్పుకొచ్చింది రెజీనా. అందరికీ ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పలేం కానీ, తన విషయంలో మాత్రం బాలీవుడ్ జర్నీ అంత సాఫీగా సాగలేదని ఆమె కుండబద్దలు కొట్టింది.
ఇవి కూడా చదవండి
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ కల్చర్ మీద ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. రెజీనా అక్కడి ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఇప్పటికీ వేచి చూస్తూనే ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ వంటి హిందీ ప్రాజెక్టులతో ఆమె బిజీగానే ఉంది. మరోవైపు తమిళంలోనూ అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ఆమె కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. ఇక్కడ రెజీనా కనిపించి చాలా రోజులైపోయింది.. ఇంకా చెప్పాలంటే ఏళ్ళైపోయింది. విలన్గానూ నటించినా అవకాశాలు మాత్రం రావట్లేదు రెజీనాకు. అందుకే పక్క ఇండస్ట్రీల్లోనే అవకాశాల కోసం చూస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బాలీవుడ్లో నటిస్తూ.. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి నెరరేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.