హైదరాబాద్, ఫిబ్రవరి 17: రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల పిల్లలకు ఒంటి పూట బడులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు ప్రకటన వెలువరించింది. దీంతో మార్చి 16వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే బడులు నడుపుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందజేసి విద్యార్ధులను ఇళ్లకు పంపిస్తారు.
మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో ఉదయం పరీక్షలు జరుగుతాయి. కావున ఈ స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నడుపుతారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి స్పెషల్ క్లాసులు యథావిథిగా నడుస్తాయి. అనంతరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన వెలువరించింది.
ఇక జూన్ 12 నుంచి 2026 -27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. వేసవిలో తీవ్ర ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ ప్రకటన చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్ కాలేజీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించేలా ప్రత్యేక మార్పులు చేశారు. ఆయా స్కూళ్లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. అవసరమైతే వారంలో ఒక రోజు అదనపు తరగతులు పెట్టాలని సూచించారు. ఉపవాసంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.