దేశంలోని రైతులందరూ కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ నిధులు విడుదల అవుతాయా అని నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడినట్లే కనిపిస్తోంది. పీఎం కిసాన్ నిధులు విడుదలపై కేంద్రం నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రైతులకు కేంద్రం హోలీ గిఫ్ట్ ఇవ్వనుందని సమాచారం. మార్చి 4న హోలీ పండుగ రానుండగా.. ఆ పండగ గిఫ్ట్గా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. హోలీకి ముందే రైతుల అకౌంట్లో సొమ్మును రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే హోలీకి ముందే రైతులు శుభవార్త విననున్నారని చెప్పవచ్చు.
ఫిబ్రవరి 24 తర్వాత..
మార్చి తొలివారంలో హోలీ పండుగ ఉండటంతో.. ఫిబ్రవరి చివరి వారంలో డబ్బులను కేంద్రం విడుదల చేయనుందని చెబుతున్నారు. అంటే ఫిబ్రవరి 24 తర్వాత ఏ రోజైనా జమ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. మునుపటి వాయిదాల చెల్లింపులు, పండుగ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ప్రభుత్వ సకాలంలో నగదు బదిలీ చేయనుందని తెలుస్తోంది. హోలీ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 21వ విడతల నగదు అందించారు. ఇప్పుడు 22వ విడత నగదు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విడతలో రూ.2 వేలను రైతులు బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. గత ఏడాది నవంబర్ 19న 21వ విడత నగదు బదిలీ జరిగింది.
వీరికి రూ.4 వేలు
2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకంగా ఇది ఉంది. అయితే సాంకేతిక సమస్య వల్ల గత విడత నగదు అందుకోనివారు ఇప్పుడు ఒకేసారి రూ.4 వేలు అందుకోనున్నారు. తప్పులను సరిచేసుకున్న వారికి ఇవి అకౌంట్లో పడతాయి. ఇక మిగతా రైతులకు యథావిధిగా రూ.2 వేలు జమ కానున్నాయి. ఈ పథకంలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ఈకేవైసీ ప్రాసెస్ను తప్పనిసరి చేసింది. ఇది చేయించుకోకపోతే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. మీ కిసాన్ పోర్టల్ లేదా సీఎస్సీ సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయం ద్వారా సింపుల్గా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం పేర్కొంది.