IND vs PAK : భారత్ చేతిలో చిత్తుగా పాక్.. టీవీలు పగులగొట్టి, చెప్పులతో కొట్టిన అభిమానులు

IND vs PAK : భారత్ చేతిలో చిత్తుగా పాక్.. టీవీలు పగులగొట్టి, చెప్పులతో కొట్టిన అభిమానులు


IND vs PAK : ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక యుద్ధంలాంటిది. అది టీ20 ప్రపంచకప్ 2026 అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో టీమిండియా ఏకంగా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ దేశంలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. స్టేడియంలో ప్లేయర్లు విలవిలలాడితే, పాకిస్తాన్ వీధుల్లో అభిమానులు తమ టీవీలను పగులగొడుతూ రచ్చ రచ్చ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తుంటే పాక్ అభిమానుల కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పాకిస్తాన్‌లో ఒక వింత సంప్రదాయం ఉంది.. భారత్ చేతిలో పాక్ ఓడిపోతే అక్కడ టీవీలు పగిలిపోవాల్సిందే. ఈసారి కూడా అదే పునరావృతమైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన పాక్ అభిమానులు, లైవ్ రిపోర్టింగ్ జరుగుతుండగానే టీవీలను రోడ్డుపైకి తెచ్చి ఇటుకలతో పగులగొట్టారు. అంతటితో ఆగకుండా, తమ జట్టు ఆటగాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పగిలిన టీవీలపై చెప్పులతో కొట్టారు. ఆఖరికి రిపోర్టర్ కూడా ఆవేశం తట్టుకోలేక టీవీని తన్నడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. “మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్లు కొని, టీవీలు కొని మ్యాచ్‌లు చూస్తుంటే.. వీళ్లు మాత్రం గ్రౌండ్‌లో విహారయాత్రకు వెళ్ళినట్లు ఆడుతున్నారు” అంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన దశ అని ఆ దేశ మాజీ దిగ్గజం మహమ్మద్ యూసుఫ్ మండిపడ్డారు. పాక్ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని, అందుకే జట్టు ఈ స్థితికి చేరుకుందని ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌ల కాలం చెల్లిపోయిందని, వారిని వెంటనే జట్టు నుంచి తొలగించి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్రికెట్ గురించి కనీస అవగాహన లేని వ్యక్తులు బోర్డులో ఉండటం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు.

మరో మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ కూడా పాక్ జట్టుపై నిప్పులు చెరిగారు. భారత క్రికెట్ ప్రమాణాలు ఇప్పుడు ఎక్కడో ఉన్నాయని, పాకిస్తాన్ కనీసం వారి దరిదాపుల్లో కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. టీమిండియా దగ్గర ఉన్నంత టాలెంట్, సిస్టమ్ పాక్ దగ్గర లేవని, అందుకే ప్రతిసారి భారత్ ముందు పాకిస్తాన్ తలవంచుతోందని ఆయన విశ్లేషించారు. మైదానంలో టీమ్ ఇండియా చూపించిన ఆధిపత్యం చూస్తుంటే, పాకిస్తాన్ క్రికెట్ ఇంకా పాత కాలంలోనే ఉండిపోయిందని అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ ప్రయాణం క్లిష్టతరంగా మారింది. ఒకవైపు భారత అభిమానులు విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు జరగాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ నుంచి సెలక్షన్ కమిటీ వరకు అన్నిటినీ ప్రక్షాళన చేయకపోతే పాక్ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *