హైదరాబాద్ KPHBలో అర్థరాత్రి అగ్నిప్రమాదం కలకలం రేపింది. KPHB రోడ్నెంబర్-3లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించి కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని సామాగ్రికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహాశివరాత్రి, పండుగల సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు దీపం దగ్గర కాగితాలు, కర్టెన్లు, ప్లాస్టిక్ వస్తువులు పెట్టకూడదు. అలాగే అగరబత్తీలు కూడా జాగ్రత్తగా వాడాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది.