అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎన్నికలకు ముందు ఓటర్లకు నగదు, కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే, పోలింగ్ ముగిసిన మరుసటి రోజే సదరు అభ్యర్థి అనుచరులు వార్డులోకి వెళ్లి, “మాకు ఓట్లు వేయలేదు.. మా గిఫ్ట్లు మాకు ఇచ్చేయండి” అంటూ వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళలు, తాము అడగకుండానే గిఫ్ట్లు ఇచ్చి ఇప్పుడు అవమానిస్తారా అంటూ తమ పేర్లు రాసిన కుక్కర్ బాక్సులను రోడ్డుపై పడవేసి నిరసన తెలిపారు.కౌంటింగ్ జరగకముందే ఓట్లు పడలేదని రచ్చ జరిగినప్పటికీ, ఫిబ్రవరి 13న వెలువడిన ఫలితాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. అదే కాంగ్రెస్ అభ్యర్థి 237 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అంటే, ఓటర్లు ఆ అభ్యర్థిపై నమ్మకాన్ని వమ్ము చేయలేదని స్పష్టమైంది. నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను. కొందరు ప్రత్యర్థులు కావాలని నాపై కుట్ర పన్ని, గిఫ్ట్ల విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేశారు. కానీ ప్రజలు నిజానిజాలు గ్రహించి నన్ను గెలిపించారు.. అంటూ గెలిచిన అభ్యర్థి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గిఫ్ట్ల వివాదం నడిచినా, అంతిమంగా ఓటర్లు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేశారా? లేక విమర్శలను తిప్పికొట్టేలా తీర్పు ఇచ్చారా? అన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం :