తిరుపతి నుంచి మూడు ప్రేమ జంటలు మూడు బైక్లపై కలిసి గండికోట సందర్శనకు బయలుదేరారు. మార్గమధ్యలో కడప నగర శివారులోని ఆలంఖాన్ పల్లె వద్దకు రాగానే, వేగంగా వచ్చిన ఒక లారీ వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే ప్రియురాలు ప్రాణాలు విడవడం చూసి ఆ యువకుడు, తోటి స్నేహితులు తల్లడిల్లిపోయారు. వాలెంటైన్స్ డే రోజున ఆనందంగా గడపాల్సిన ఆ యువతీయువకులు, ఇలా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. అటవీ ప్రాంతం, కనువిందు చేసే గండికోట అందాలను చూడాలనుకున్న వారి కలలు కడప రోడ్డుపైనే కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
మరిన్ని వీడియోల కోసం :