Vaibhav Sooryavanshi : టీమిండియాను అండర్-19 ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిన కీలక ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి, ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతటి స్టార్డమ్ ఉన్నా, చదువు విషయంలో మాత్రం తాను ఒక సాధారణ విద్యార్థినే అని నిరూపిస్తున్నాడు. బిహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు.
వైభవ్ పరీక్షలకు హాజరవుతున్న విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిశోర్ స్వయంగా ధృవీకరించారు. అయితే ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వైభవ్ సెలబ్రిటీ క్రికెటర్ అయినప్పటికీ, పరీక్షా కేంద్రంలో ఆయనకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేదా విలాసాలు ఉండవని స్పష్టం చేశారు. “ఇది అకడమిక్ పిచ్, క్రికెట్ పిచ్ కాదు. మిగిలిన విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో, వైభవ్కు కూడా అవే ఉంటాయి. ఆయన ఇప్పటికే తన అడ్మిట్ కార్డ్ తీసుకున్నారు” అని ప్రిన్సిపల్ తెలిపారు.
14 ఏళ్ల వయసులోనే ప్రపంచకప్లో 439 పరుగులు సాధించి, సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచిన వైభవ్ రాకతో స్కూల్లో సందడి నెలకొంది. టీచర్లు, తోటి విద్యార్థులు ఆయనను చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో పరీక్షల సమయంలో ఎలాంటి గందరగోళం కలగకుండా, ఇతర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్కూల్ మేనేజ్మెంట్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, 35 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ బిహార్ కుర్రాడు, పరీక్షల్లో కూడా అదే జోరు చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రపంచకప్లో వైభవ్ సృష్టించిన విధ్వంసం:
ఫైనల్ ఇన్నింగ్స్: 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు).
టోర్నీ మొత్తం: 7 మ్యాచ్ల్లో 439 పరుగులు.
సగటు: 62.71, స్ట్రైక్ రేట్: 169.49.
ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.