తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని, 750 వార్డుల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్న ఆయన.. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయని అన్నారు. 117 స్థానాల్లో తమకు మంచి ఫలితాలు వచ్చాయని, 750 వార్డుల్లో విజయం సాధించామని తెలిపారు. చాలాచోట్ల అధికార దుర్వనియోగం జరిగిందని ఆరోపించిన కేటీఆర్.. ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టారని అన్నారు. సిగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోటీ చేశామని, ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకునేందుకు సీపీఐతో కలిసి పోటీ చేసినట్లు వెల్లడించారు.
కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్
కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఫలితం వచ్చింది. దీంతో సీపీఐకి ఓపెన్ అన్కండిషనల్ ఆఫర్ కేటీఆర్ ప్రకటించారు. మేయర్ సీటు సీపీఐకే ఇస్తామని, కలిసొస్తామంటే రెడీ అంటూ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిద్దమని ప్రకటించారు. కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 స్థానాలు వచ్చాయి. ఇక మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1, స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్అఫీషియోతో కూడా హంగ్ ఏర్పడనుంది. పొత్తు లేకపోవడంతో హంగ్ ఏర్పడగా.. బీఆర్ఎస్ కూడా కలిసొస్తుందనే ఆశలో సీపీఐ ఉంది. కేటీఆర్ సీపీఐకు ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.