తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ముగిసే వరకు మొత్తం 66 డివిజన్లలో 36 స్థానాల్లో బీజేపీ అధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 12 డివిజన్లు, బీఆర్ఎస్ – 03, ఎంఐఎం 2 డివిజన్లతో సత్తా చాటాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 100.07 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం జనాభా 3,94,669 మంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 2,72,665 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 1,37,516 మంది పురుషులు, 1,35,149 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ జనాభాలో 9.15 శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.64 శాతం షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. కాగా, అతితక్కువగా 62.98 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్లో ఒక శాతం ఎక్కువగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
గత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2020లో జరిగాయి. ఇందులో భారత రాష్ట్ర సమితి (BRS) 33 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ (BJP) 13 సీట్లను గెలుచుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఆరు సీట్లను గెలుచుకుంది. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. ఇక ఈసారి ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం దిశగా పరుగులు పెడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..