మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ పైకి తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడుతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్లను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్లో వెయ్యి బ్యాలెట్ల 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1,000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
Watch LIVE:
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..