తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 20 వేల మంది సిబ్బందిని కేవలం లెక్కింపు ప్రక్రియ కోసమే నియమించారు. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది.
ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. విజయంపై మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
నేడు వైన్ షాపులు బంద్
తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి..