
తెలంగాణలో ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జగనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుండగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగియగా.. 73.01 పోలింగ్ శాతం నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి.
వైన్ షాప్స్ బంద్
ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం కౌంటింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సైబరాబాద్ పరిధిలో మూసివేత
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం మునిసిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి పరిధిలో కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం, చిట్కుల్, ఇస్నాపూర్, రుద్రారంతో పాటు గడ్డపోతరం మున్సిపాలిటీలోని గడ్డపోతరం, ఖాజీపల్లి, మాధార, ముడిచింతలపల్లి మునిసిపాలిటీలో మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. అటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హోరాహోరీగా ఎన్నికలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి. ఇక డబ్బులు కూడా భారీగా పెంచారు. మద్యం కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు సరఫరా చేశారు. పార్టీలన్నీ పోటాపోటీగా తీసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది హాాట్టాపిక్గా మారింది. ఇప్పటికే ఎగ్జిల్ పోల్స్ విడుదల అవ్వగా.. కాంగ్రెస్కు ఆధిక్యం ఇచ్చాయి. అటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గట్టిగా పోటీ ఇచ్చారు. ఇక బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఈ త్రిముఖ పోరుతో మున్సిపల్ ఎన్నికలు రంజుగా జరిగాయని చెప్పవచ్చు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందనేది శుక్రవారం తేలనుంది.