Dhari Devi Temple: రోజులో మూడు రూపాలు.. ఎన్నో ప్రత్యేకతల ధారి దేవి ఆలయాన్ని దర్శించాల్సిందే..!

Dhari Devi Temple: రోజులో మూడు రూపాలు.. ఎన్నో ప్రత్యేకతల ధారి దేవి ఆలయాన్ని దర్శించాల్సిందే..!


Dhari Devi Temple: భారతదేశంలో దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనేక మహిమాన్వితమైన దేవాలయాలు వెలసి ఉన్నాయి. మంచుతో కప్పుకున్న హిమాలయ శిఖరాల మధ్య విరాజిల్లే ఈ ఆలయాల్లో చాలావరకు స్వయంభూ క్షేత్రాలుగా భక్తులకు దర్శనమిస్తాయి. మరికొన్ని ఆలయాలు ఎన్నో అద్భుతాలు, రహస్యాలు, విశ్వాసాలకు నిలయాలుగా నిలిచాయి. అలాంటి శక్తివంతమైన క్షేత్రాల్లో ధారి దేవి ఆలయం ప్రత్యేకమైనది.

ఉత్తరాఖండ్ రక్షక దేవత – ధారి దేవి

అలకనంద నది ఒడ్డున, ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రక్షక దేవతగా భావించబడుతుంది. కాళికాదేవి అంశంతో అవతరించిన దేవిగా ధారి దేవిని స్థానికులు ఆరాధిస్తారు. చార్ ధామ్ యాత్రా ప్రాంతం సహా మొత్తం హిమాలయ ప్రాంతాన్ని ఈ అమ్మవారి దైవశక్తి కాపాడుతుందని గాఢ విశ్వాసం ఉంది.

రూపాంతరాల విశేషం

పురాణ కథనాల ప్రకారం ధారి దేవి రోజుకు మూడు సార్లు రూపం మార్చుకుంటుందట. ఉదయాన్నే యువతిగా, మధ్యాహ్నం మధ్యవయస్కురాలిగా, సాయంత్రం యోధురాలైన భయంకర రూపంలో దర్శనమిస్తుందని అంటారు. ఈ విశేషం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

గర్భగుడిలో కాదు.. ఆలయం వెలుపలే..

సాధారణంగా దేవతలు గర్భగృహంలో ప్రతిష్ఠించబడుతారు. కానీ ధారి దేవి మాత్రం ఆలయం వెలుపలే కొలువై ఉండడం ప్రత్యేకత. భూమిపై ఉన్న సృష్టిని, ప్రకృతిని సంరక్షించేందుకు ఆమె ఇలా బహిరంగంగా దర్శనమిస్తోందని స్థానికులు చెబుతారు.

అమ్మవారిని అగౌరపరిస్తే..

స్థానిక జానపద కథనాల ప్రకారం ధారి దేవిని ఎవరైనా అవమానిస్తే లేదా అగౌరవంగా ప్రవర్తిస్తే ప్రకృతి కోపిస్తుందనే నమ్మకం ఉంది. 2013లో రోడ్డు పనుల నిమిత్తం అమ్మవారి విగ్రహాన్ని తాత్కాలికంగా తరలించిన తర్వాత వచ్చిన భారీ వరదలను ఈ సంఘటనతో అనుసంధానించి స్థానికులు చెబుతారు. అందుకే ధారి దేవిపై అపారమైన భక్తి, గౌరవం నెలకొంది.

ఆధ్యాత్మిక ప్రశాంతత

ఒక వైపు వేగంగా ప్రవహించే అలకనంద నది, మరో వైపు చల్లని పర్వత గాలులు, వేద మంత్రోచ్ఛారణలతో మారుమ్రోగే పరిసరాలు.. వీటన్నింటితో ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం, సాధన చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన క్షేత్రంగా భావించబడుతుంది.

అపురూప దర్శనం

ధారి దేవి దర్శనం ఒక్కసారి లభించినా చాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చార్ ధామ్ యాత్రికులు కూడా తమ యాత్ర విజయవంతంగా సాగాలని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ధారి దేవి ఆలయం కేవలం తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక మేల్కొలుపుకు దారి చూపే పవిత్ర క్షేత్రంగా నిలిచింది.

నవరాత్రి వైభవం

దేవి నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించేందుకు తరలివస్తారు. ఈ సమయంలో ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఆధ్యాత్మికతతోపాటు ప్రకృతి అందాలతో కొలువైన ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *