మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.. ఓటర్ల తీర్పు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరికొన్ని గంటల్లో ఆ బాక్సులు ఓపెన్ కాబోతున్నాయి. పుర ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఏ పార్టీకి మద్దతు తెలిపారనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. అయితే.. మెజారిటీ స్థానాల్లో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.. పోటీ చేశాడు. ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని కోరాడు. పంచాల్సిన చోట మంచిగానే డబ్బులూ పంచాడు. అంతేకాకుండా.. కుక్కర్లు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు.. ఇంత వరకు బాగానే ఉంది.. అయితే.. తీరా పోలింగ్ అయ్యాక ఓడిపోతానేమోనని భయపడ్డాడు. అంతే.. మళ్లీ ఇల్లిల్లూ తిరగడం మొదలెట్టాడు. తాను ఇచ్చినవి వెనక్కి ఇచ్చేలాయంటూ వాళ్లతో గొడవకు దిగాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. నిన్న ఓటర్లకు గిఫ్ట్లు పంచి.. ఇవాళ తిరిగి ఇవ్వాలంటూ అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు పేచిపెట్టాడు..
నిన్న పోలింగ్ తర్వాత ఓడిపోతానని హరిబాబులో భయం పట్టుకుంది. దీంతో ఓటర్ల దగ్గరకు వెళ్లి.. తాను ఇచ్చిన గిఫ్ట్లు, డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గొడవకు దిగాడు.. కౌంటింగ్కి ముందే తాము ఓటు వేయలేదని ఆరోపిస్తే ఎలాగని..కాంగ్రెస్ అభ్యర్థి తీరుపై ఆగ్రహంతో మహిళలు రోడ్డెక్కారు. తమకు గిఫ్ట్గా ఇచ్చిన కుక్కర్లు రోడ్డుపై పడేసి ధర్నా చేశారు. నిన్న ఓటుకు రూ.2500తోపాటు కుక్కర్ పంచారని.. కౌంటింగ్ కాకముందే.. ఓడిపోతానంటూ.. తానిచ్చిన డబ్బులు, గిఫ్టులు ఇవ్వాలంటూ గొడవపెట్టుకుంటున్నారంటూ స్థానికులు తెలిపారు. ఈ ఘటన సంచలనంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..