అల్లూరి జిల్లాలోని ఆ ఏజెన్సీ గ్రామం చీకట్లో మగ్గిపోతోంది. సూర్యాస్తమయం అయితే కాగడాల వెలుతురులోనే వాళ్ళ జీవనం. ఎన్నో ఏళ్ల పోరాటంతో.. ఇటీవల వీరికి సోలార్ ప్యానల్ తో విద్యుత్ వెలుగులు అందాయి. గతంలో ఎన్నడూ లేని విద్యుత్ కాంతులు అనడంతో ఒక్కసారిగా ఆ గిరిజనులు ఎగిరి గంతేశారు. కానీ ఆ ఆనందం ఎంతకాలం నిలవలేదు. సోలార్ ప్యానల్ కూడా మూలాన చేరడంతో.. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో కాగడలు చేత పట్టుకుని తమ గ్రామానికి విద్యుత్ వెలుగులు నింపండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ఈపీడీసీఎల్ సిఎండి స్వీకరించిన తర్వాత.. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ గిరిజనులు.. సిఎండికి ఫోన్ చేసి. హలో సార్ మాకు కరెంటు లేదండి.. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించండి సారూ అంటూ వేడుకున్నారు.
అనంతగిరి మండలం మారుమూల దబ్బలపాడు విద్యుత్ సౌకర్యానికి దూరమై స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండలపై దట్టమైన అటవీ ప్రాంతంలోని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రాత్రివేళల్లో కాగడాలతో వెలుతురులో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలో 2013-14 లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మూడేళ్ల వరకు బాగానే పనిచేసింది. ఆ తరువాత మూలకు చేరింది. అయితే, అప్పటి నుంచి గిరిజనులు చీకటి పడితే.. కాగడాల మధ్య జీవనాన్ని సాగించాల్సి వస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో 24 కుటుంబాలు జీవనం సాగించేవి. గ్రామంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పెదరావకొండ కిందకు 15 కుటుంబాల గిరిజనులు దిగి వచ్చేశారు. మిగిలిన కుటుంబాలు కొండపైనే జీవనం సాగిస్తున్నాయి.
విద్యుత్ సౌకర్యం లేక రాత్రివేళల్లో వన్యప్రాణుల మధ్య కాలాన్ని భయం భయంగా వెళ్దియాల్సి వస్తోందని గిరిజనులు వాపోతుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సోలార్ విద్యుత్ ప్లాంట్ కు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తేవాలని అభ్యర్థిస్తున్నారు. లేకుంటే తమ గ్రామానికి శాశ్వత విద్యుత్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. తమ మొర ఆలకించి సమస్య తీర్చాలని కోరుతున్నారు ఆ గిరిజనులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..