కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న భారత్ బంద్ చేపట్టనున్నట్ల దేశంలోని కార్మిక సంఘాలన్నీ ప్రకటించాయి. ఇక యూఎస్-భారత్ మధ్య జరిగిన వాణిజ్యం ఒప్పందం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ రైతు సంఘాలు కూడా గురువారం దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో రేపు దేశంలోని స్కూళ్లు, కాలేజీలు మూతపడే అవకాశముంది.
రవాణా వ్యవస్థలో ప్రజలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు కూడా ప్రభావితం కావొచ్చు. గురువారం పలు సేవలు పొందటంలో దేశ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. అయితే రేపు బ్యాంక్లు కూడా మూతపడతాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం చూద్దాం
అయితే కార్మిక చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపడుతున్న బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి ప్రధాన బ్యాంకు ఉద్యోగుల సంఘాల కూడా మద్దతు ప్రకటించాయి. రేపు బంద్లో పాల్గొననున్నట్లు తెలిపాయి. దీంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది.
బ్యాంక్ ఉద్యోగులు బంద్లో పాల్గొనడం వల్ల సేవల్లో అంతరాయం కలగనుంది. బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలు ప్రభావితం కావొచ్చు. బ్రాంచ్లను విజిట్ చేసే కస్టమర్లకు సర్వీసులు త్వరగా అందకపోవచ్చు. దీంతో బ్రాంచ్ స్థాయి కార్యకలాపాలు సజావుగా పనిచేయకపోవచ్చు.
ఈ క్రమంలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని బట్టి సేవలు ప్రభావితం అవుతాయని బ్యాంకులు తెలిపాయి. ఆర్బీఐ మాత్రం ఫిబ్రవరి 12న ఎలాంటి సాధారణ సెలవు ప్రకటించలేదు. బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వల్లన వినియోగదారులు కొన్ని ప్రాంతాల్లో పరిమిత సేవలను మాత్రమే పొందగలుగుతారు.




