గత కొంత కాలంగా వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. అమెరికా డాలర్ భవిష్యత్తుపై ఆయన మరోసారి బాంబు పేల్చారు. తాజాగా తాను మరో 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించిన ఆయన, భవిష్యత్తులో వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుతాయని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఔన్సు ధర సుమారు 82 డాలర్లు ఉండగా, 2026 ముగిసే సమయానికి ఇది 200 డాలర్ల మార్కును చేరుకుంటుందని లేదా అంతకంటే ఎక్కువ అవుతుందని ఆయన దృఢంగా విశ్వసిస్తున్నారు. ‘‘అమెరికా డాలర్ ప్రమాదంలో ఉంది. ఫేక్ మనీని దాచుకునేవారే అతిపెద్ద నష్టపోతారు’’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
2026 నాటి సిల్వర్ ఈగల్స్ భవిష్యత్తులో అత్యంత విలువైన కలెక్టర్ కాయిన్స్గా మారుతాయని, ఎందుకంటే సిల్వర్ మార్కెట్లో తీవ్రమైన కల్లోలం రాబోతోందని కియోసాకి అంచనా వేశారు. కియోసాకి ట్వీట్ అంతర్జాతీయంగా వైరల్ అవుతుంటే, మన దేశీయ మార్కెట్లో వెండి ధరలు ఇప్పటికే రికార్డులను తిరగరాస్తున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ.3 లక్షల మార్కును దాటింది. సోమవారంతో పోలిస్తే కేజీపై సుమారు రూ.15,000 పెరగడం గమనార్హం. కియోసాకి అంచనా ప్రకారం.. ఒక ఔన్సు 200 డాలర్లకు చేరితే, రూపాయి విలువను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలో కేజీ వెండి ధర రూ. 6 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకు పెరుగుతోంది?
డాలర్ విలువ పడిపోవడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన హార్డ్ అసెట్స్ అంటే బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఏఐ, చిప్ తయారీ, సోలార్ ప్యానెల్స్లో వెండి వినియోగం విపరీతంగా పెరగడం కూడా ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.తవ్వకం తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండికి కొరత ఏర్పడింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి