సోమవారం బంగారం ధరలు మళ్లీ పంజుకున్నాయి. గత కొద్దికాలంగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడింది. డాలర్ బలహీనడపటం, ప్రపంచ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే వార్తల నడుమ జనవరి 9న గోల్డ్ రూ.1.57 లక్షలకు చేరుకోగా.. వెండి రూ.2.61 లక్షలు క్రాస్ చేసింది. గోల్డ్ ధర రూ.1310 పెరగ్గా.. సిల్వర్ రేటు ఒకేసారి రూ.15 వేలు పెరిగింది. పసిడి ధరల్లో భారీగా ఒడిదొడుకులు నమోదవుతున్న ఈ తరుణంలో బంగారం కొనుగోలు చేయవచ్చా..? లేదా మరికొంతకాలం వేచి ఉండాలా..? అనే ఆందోళన చాలామందిలో కలుగుతుంది. దీనిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే..?
సడెన్గా ఈ పెరుగుదల ఎందుకు..?
సోమవారం పసిడి ధరలు పెరగడానికి ప్రపంచ అంశాలు ప్రభావితం చూపించాయి. ఫిబ్రవరి 4 తర్వాత యూఎస్ డాలర్ కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం, వెండి ధరలు ఇతర కరెన్సీలతో విదేశీ కొనుగోలుదారులకు చౌకగా లభిస్తుంది. దీని వల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ దౌత్యవేత్త అమెరికాతో అణు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. యురేనియం సుసంపన్నత హక్కును వదలుకునేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో గోల్డ్ రేట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక అమెరికా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. డాలర్ బలహీనపడటంతో వడ్డీ రేట్లలో ఒకటి లేదా రెండు శాతం కోత విధించనుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల బంగారం వంటి వడ్డీ రాని ఆస్తులను కలిగి ఉండటం పెట్టుబడిదారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. దీని వల్ల బులియన్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో వెళుతుంది.
పెట్టుబడులకు ఇది మంచి అవకాశమా..?
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పసిడి ధరలు కొంతకాలం స్ధిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక వెండికి స్థిరమైన పారిశ్రామిక డిమాండ్, నిర్మాణాత్మక సరఫరా లోటు ధరలు తగ్గకుండా నిరోధిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడం, ద్రవ్య విధానాలను సడలించే సంకేతాలతో బులియన్ మార్కెట్ ట్రెండ్ సానుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో ఫిబ్రవరి డెలివరీ పూర్తయ్యే బంగారం ధర 1.31 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1.57 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక మార్చి డెలివరీ వెండి ధర 4.81 శాతం పెరిగి రూ.2.61 లక్షల వద్ద కొనసాగుతోంది. సోమవారం వెండి ధరల 6 శాతం పెరిగాయి.