డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..

డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..


సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఇందు కోసం దొంగలు కొత్త అవతారాలేత్తుతున్నారు. దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ దొంగ డాక్టర్ అవతారమేత్తాడు. సంతానం లేని దంపతులను టార్గెట్‌గా చేసుకొని బంగారంతో ఉడాయించాడు. ఈ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన ప్రణీత, రాజ్ కుమార్ దంపతులు సంతానం లేమితో బాధపడుతున్నారు. సంతానం కోసం వివిధ ఆస్పత్రులు తిరిగిన వీరికి ఫలితం లేకపోయింది. ఓ దొంగ యునాని డాక్టర్ గా అవతారమెత్తి భూదాన్ పోచంపల్లిలో మోటార్ సైకిల్ పై తిరుగుతున్నాడు. ప్రణీత, రాజ్ కుమార్ దంపతుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి కేరళ యునాని వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. సంతానం లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మించాడు. హైదరాబాదులో కేరళ యునాని ఆసుపత్రికి కూడా ఉందని చెప్పాడు. లిక్విడ్ 40 రోజుల పాటు వాడితే ఫలితం ఉంటుందని నమ్మబలికాడు.

సంతాన లేమితో బాధపడుతున్న ఈ దంపతులు.. యునాని డాక్టర్ గా వచ్చిన దొంగ మాటలను నమ్మారు. ఆ దంపతుల ఇంట్లో దొంగ డాక్టర్ గంటన్నరకు పైగా గడిపాడు. తన వద్ద ఉన్న లిక్విడ్ ను దంపతుల ఒంటిపై రాశాడు. ఆ సమయంలో ప్రణీత ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీయమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత లిక్విడ్ పోయేలా స్నానం చేసి రావాలని దంపతులకు చెప్పాడు. అది నమ్మిన దంపతులు బంగారం అక్కడే ఉంచి స్నానానికి వెళ్లిపోయారు. దీంతో దోపిడి దొంగ ఆ బంగారంతో పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

స్నానం చేసి వచ్చిన తర్వాత చూస్తే దోపిడి దొంగ, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సదరు బాధితులు లబోదిబోమన్నారు. ఐదు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడని దంపతులు వాపోతున్నారు. చేసేదేమీ లేక ఆ దంపతులు పోచంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులను మోసగించిన ఆ దొంగ ఆచూకీ కోసం పోలీసులు సిసి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పసరు, రసాయనాలతో సంతానం కలుగుతుందని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *