Tollywood: ఆంధ్రా దిలీప్ చలం గుర్తున్నారా.! ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా..

Tollywood: ఆంధ్రా దిలీప్ చలం గుర్తున్నారా.! ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా..


కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా రకరకాల పాత్రలు పోషించి తన ప్రతిభ చాటుకున్న వ్యక్తి చలం. చార్లీ చాప్లిన్, జిమ్ క్యారీ, రాజ్ కపూర్ లాంటి దిగ్గజ నటుల తరహాలో నవ్విస్తూనే ప్రేక్షకుల్ని ఏడిపించిన అరుదైన నటుడిగా ఆయన పేరు పొందారు. 1929లో కళలకు నిలయమైన పాలకొల్లులో జన్మించిన చలం పూర్తి పేరు కోరాడ సూర్యచలం. ఆనాటి రంగస్థల ప్రముఖుడు పినిశెట్టి శ్రీరామమూర్తికి ఆయన శిష్యులు. తెలుగు నాటక చరిత్రలో పినిశెట్టికి ప్రత్యేక స్థానం ఉంటే, చలం కూడా దాదాపుగా ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. పినిశెట్టి సారధ్యంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో నటించిన ‘అన్నా చెల్లెలు’, ‘పల్లెపడుచు’ వంటి నాటకాలు నటుడిగా చలం ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయి.

1952లో ఎన్టీఆర్ నటించిన ‘దాసి’ చిత్రంతో చలం ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘నా చెల్లెలు’ చిత్రంలో అమర్నాథ్ హీరో కాగా, చలం రెండో హీరోగా నటించారు. సుమారు 30 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉంటూ తనదైన గుర్తింపు సాధించారు చలం. ఎన్టీఆర్, అక్కినేని లాంటి అగ్ర నటుల అభిమానాన్ని చూరగొని, వారి చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తోడిదొంగలు, భలే రాముడు, వద్దంటే పెళ్లి, పెళ్లి సందడి, పెళ్లి మీద పెళ్లి, ఇలవేలుపు, వదినగారి గాజులు తదితర చిత్రాల్లో చలం కీలక పాత్రలు పోషించారు.

వ్యక్తిగత జీవితంలో కూడా చలం అనేక మలుపులు చూశారు. 1959లో పరిశ్రమలో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకువచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయవాడకు చెందిన వెంకటరమణ ఆయన జీవితంలోకి ప్రవేశించి ఎంతో ప్రభావితం చేశారు. కొంచెం డల్‌గా ఉన్న చలం కెరీర్ పెళ్లైన తర్వాత ఊపందుకోవడంతో సెంటిమెంటుగా భావించి, తన పేరులో అర్ధ భాగాన్ని చేర్చుకుని రమణాచలం అయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే, 1964లో ఫైర్ యాక్సిడెంట్లో రమణ మరణించారు. ఆమె మరణానంతరం శ్రీ రమణ చిత్ర పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి చిత్రంగా ‘సంబరాల రాంబాబు’ నిర్మించారు. నిర్మాతగా డబ్బు తేవడమే కాకుండా నటుడిగా ఆయన స్థాయిని పెంచిన చిత్రం ‘సంబరాల రాంబాబు’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శారదను ప్రేమించి 1969 మే 1న తిరుపతిలో చలం పెళ్లి చేసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు కొన్ని నెలలలోనే చలం పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక ఆయన నుంచి విడాకులు తీసుకున్నట్లు శారద ప్రకటించారు.

చలం ఎన్టీఆర్‌ను ‘ఫాదర్’ అని, అక్కినేనిని ‘గురూజీ’ అని పిలిచేవారు. తన తొలి సినిమా ‘దాసి’లో ఎన్టీఆర్‌ను ‘ఫాదర్’ అని పిలవడం అలవాటుగా మారింది. చలం నిర్మించే ప్రతి చిత్రం షూటింగ్ ఓపెనింగ్‌కు ఎన్టీఆర్ వచ్చి ఆశీస్సులు అందించేవారు. ‘పెళ్లి సందడి’ చిత్రంలో అక్కినేనిని ‘గురూజీ’ అని పిలవడం అప్పటి నుంచి అలవాటుగా మారింది. చలానికి పెద్దగా కోపం వచ్చేది కాదు. నవ్వుతూనే మాట్లాడేవారు. ఏదీ సీరియస్‌గా తీసుకోలేదు, చివరికి జీవితాన్ని కూడా. చివరి రోజుల్లో అవకాశాలు తగ్గినా చలం నిరాశ పడలేదు. అలా చిన్న వయసులోనే 1985 ఫిబ్రవరి 19న చలం కన్నుమూయడంతో ఆయన కలలు నెరవేరలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *