నేటినుంచి మొదలైన టీ20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. తొలిరోజే భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ మొదలుకాక ముందే టీమిండియాకు గాయాల బెడద తగిలింది. ఇప్పటికే హార్షిత్ రాణా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అమెరికా జట్టుతో ప్లేయింగ్ 11 నుంచి బుమ్రా దూరమయ్యాడు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. అందుకే అతనికి విశ్రాంతి ఇచ్చారని చెబుతున్నారు.
ఫిబ్రవరి 7న భారత్ వర్సెస్ అమెరికా జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. గ్రూప్ ఏలో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ లో బుమ్రా లేకుండా సూర్యసేన బరిలోకి దిగవచ్చు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక మేరకు బుమ్రాకు వైరల్ ఫీవర్ వచ్చిందని, అందుకే స్టార్ పేసర్ కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మ్యాచ్ కు ఒకరోజు ముందు ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ కు బుమ్రా కూడా హాజరయ్యాడు. కానీ, ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. రాబోయే మ్యాచ్ ల మేరకు ఈ స్టార్ పేసర్ కు విశ్రాంతి ఇచ్చారు.