తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ హాట్ టాపిక్గా మారింది. ఓవైపు అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్షాలు.. పోటాపోటీగా సిద్ధమవుతున్న వేళ.. జనసేన సైతం పుర పోరులోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిరేపింది. ప్రచారానికి పవన్ వస్తున్నారనే ముచ్చట.. మరింత హీటు పుట్టించింది. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీంతో జనసేన-బీజేపీ అభ్యర్థుల్లో నిరాశ ఎదురైంది.
శనివారం, ఆదివారం ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల బరిలో దిగిన తమ పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసేందుకు పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించాలని భావించారు. ఈ మేరకు తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. అంతేకాదు, తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగానూ పవన్ ప్రచారం చేయాలనుకున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి… పవన్ను కలిసి ఆహ్వానం పలికారు.
ఇదిలావుంటే, తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు అదే పట్టణ ఓటర్లలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లను చీలకుండా బీజేపీ పవన్ కల్యాణ్ను రంగంలోకి దింపాలని భావించింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్లో పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ను కోరారు. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారు. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..