యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురంకు లక్ష్మయ్య.. ఇతర మత్స్యకారులతో కలిసి గ్రామ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. చేపల కోసం వల విసిరాడు. వల విసిరిన కాసేపటికే చేపలతో వల బరువెక్కింది. వలను పైకి లాగి చూసిన లక్ష్మయ్య షాక్ తిన్నాడు. వలలో కొన్ని చేపలతోపాటు బంగారు రంగులో ఉన్న చేప కనిపించింది. బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతోంది. దీంతో ఆశ్చర్యపోయిన మత్స్యకారులు బంగారు వర్ణంలో ఉన్న చేపను గోల్డెన్ ఫిష్గా గుర్తించారు. ఆరు కిలోల బరువు ఉన్న ఈ చేప చాలా అరుదుగా లభిస్తుందని, తమ చెరువులో ఈ చేప దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. మత్స్యకార కార్మిక సంఘం.. ఈ చేపను వేలం వేయగా గ్రామ సర్పంచ్ రాంలింగారెడ్డి రూ.10వేలకు కొనుగోలు చేశారు. ఇలాంటి అరుదైన చేప..అందులోనూ ఇంత పెద్ద చేప చిక్కడం ఇదే తొలిసారి అని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.