Cricket Rules: వికెట్ పడిన తర్వాత పెవీలియన్‎కు వెళ్తానంటే ఇక కుదరదు.. మారిన క్రికెట్ రూల్స్.. బంతి సైజు కూడా

Cricket Rules: వికెట్ పడిన తర్వాత పెవీలియన్‎కు వెళ్తానంటే ఇక కుదరదు.. మారిన క్రికెట్ రూల్స్.. బంతి సైజు కూడా


Cricket Rules: క్రికెట్ నిబంధనలను రూపొందించే అత్యున్నత సంస్థ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ 2026 ఏడాదికి గానూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆటలో మరింత పారదర్శకత, ఉత్కంఠను పెంచేందుకు టెస్ట్ క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ కీలక మార్పులు చేస్తూ కొత్త చట్టాలను ప్రకటించింది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో ఆఖరి నిమిషం వరకు డ్రామా కొనసాగేలా ఎంసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఒక ఆనవాయితీ ఉండేది. అదేంటంటే రోజు ఆట ముగిసే సమయానికి (చివరి ఓవర్లో) ఏదైనా వికెట్ పడితే, వెంటనే ఆ రోజు ఆటను ముగించేసేవారు. దీనివల్ల బ్యాటింగ్ చేసే జట్టుకు ఒక వెసులుబాటు ఉండేది. వారు మరుసటి రోజు ఉదయం తమ వ్యూహానికి తగ్గట్టుగా కొత్త బ్యాటర్‌ను పంపేవారు. కానీ, ఎంసీసీ కొత్త చట్టం 12.5.2 ప్రకారం.. ఇకపై చివరి ఓవర్లో వికెట్ పడినా సరే, ఆ ఓవర్ పూర్తి కావాల్సిందే. అంటే, కొత్త బ్యాటర్ వెంటనే క్రీజులోకి వచ్చి ఆ ఓవర్లో మిగిలిన బంతులను ఎదుర్కోవాలి. దీనివల్ల ఫీల్డింగ్ టీమ్‌కు బ్యాటర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం దక్కుతుంది.

మహిళల క్రికెట్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఎంసీసీ బంతి బరువు,సైజులో మార్పులు చేసింది. ఇప్పటివరకు మహిళల క్రికెట్‌లో బంతి బరువు 140 నుండి 151 గ్రాముల మధ్య ఉండేది. ఇప్పుడు దాన్ని 140 నుండి 149 గ్రాములకు తగ్గించారు. అలాగే బంతి పరిమాణం కూడా 21.5 నుండి 22 సెంటీమీటర్లుగా నిర్ణయించారు. దీనివల్ల బౌలర్లు మరింత వేగంతో బంతులు విసరడానికి, అలాగే బ్యాటర్లు భారీ షాట్లు కొట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారు.

కేవలం అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే కాకుండా, పునాది స్థాయి క్రికెట్‌లోనూ మార్పులు తెచ్చారు. అండర్-13 జూనియర్ క్రికెట్‌లో వాడే బంతి బరువును 140-144 గ్రాములుగా స్థిరీకరించారు. దీని సైజు కూడా 20.5 నుంచి 21 సెంటీమీటర్ల మధ్య ఉండేలా నిబంధనలు మార్చారు. వర్ధమాన క్రీడాకారులు సరైన బరువున్న బంతితో ప్రాక్టీస్ చేయడం వల్ల భవిష్యత్తులో వారు సీనియర్ లెవల్‌కు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?

ఈ కొత్త నిబంధనలు 2026 జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని అధికారిక క్రికెట్ మ్యాచ్‌లకు వర్తిస్తాయి. దీనివల్ల టెస్ట్ క్రికెట్‌లో ఆఖరి ఓవర్లలో వికెట్ పడితే వచ్చే ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా డ్రా అయ్యే స్థితిలో ఉన్న మ్యాచ్‌లలో ఈ రూల్ గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఎంసీసీ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *