
నిద్రపోతున్న బాలికలపై ఎలుకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చేతులు, కాళ్లు, ముఖం అని తేడా లేకుండా ఎలుకలు కొరకడంతో 11 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నుంచి రక్తం కారుతుండటంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. కేకలు విన్న ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ఎలుకలను తరిమికొట్టి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, జరిగిన సంఘటనతో ఆ షాక్ నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా … హాస్టల్ నిర్వహణలో అపరిశుభ్రత, భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నివాస పాఠశాలల్లో విద్యార్థుల రక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సురక్షితంగా ఉండాల్సిన చోట ఇలాంటి ఘటనలు జరగడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టళ్లలో కనీస సౌకర్యాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అందరూ కోరుతున్నారు.