వరంగల్ జూ పార్క్ లో సందర్శకులను ఆహ్లాద పరిచిన బెబ్బులి మృతి చెందింది. తెల్ల పులి మరణవార్త జంతు ప్రేమికులను షాక్ అయ్యేలా చేసింది. మరణించిన తెల్ల పులి కళేబరానికి సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరులోని వెటర్నరీ కళాశాల వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం చేసిన కీలక నివేదిక సమర్పించారు.
గతఏడాది జూలై మాసంలో వరంగల్లోని కాకతీయ జూపార్క్ కు శరణ్ అనే తెల్ల బెంగాలీ పులిని తీసుకొచ్చారు.. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి ఈ తెల్ల పులిని వరంగల్ లోని కాకతీయ జూ పార్కుకు తరలించారు. దాదాపు 7 నెలల పాటు సందర్శకులను అబ్బుర పరిచింది.
సాధారణంగా పులి వయస్సు 14 ఏళ్ళు.. కాగా తెల్ల పులి 15 ఏళ్ల వయసు ఉన్నట్లు జూ పార్క్ సిబ్బంది తెలిపారు. గత కొద్ది రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పులి రెండు రోజుల నుండి ఆహారం తీసుకోవడం మానేసింది. హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. మృతి చెందిన పులి దేహానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వెటర్నరీ వైద్య బృందం తో పాటు, మామునూరులోని వెటర్నరీ కళాశాల వైద్య బృందం నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు.
గుండెపోటుతో పాటు, మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తెల్ల పులి మరణవార్త జంతు ప్రేమికులను ఆందోళనకు గురి చేసింది. ఈ పులిని వరంగల్ జూ పార్కుకు తరలించిన తర్వాత సందర్శకులు తాకిడి విపరీతంగా పెరిగింది. జూ పార్కు ఆదాయం పెరిగింది. దీంతో వీలైనంత త్వరగా మరో పులిని ఇక్కడికి తరలించాలని జంతు ప్రేమికులు, సందర్శకులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..