మనం ఎక్కువగా దేశీయా ఆపిల్ పండ్లతోపాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లను కూడా తీసుకుంటూ ఉంటాయి. అయితే, సూపర్ మార్కెట్లకు వెళ్లిన సమయంలో మెరుస్తూ కనిపించే ‘ఇంపోర్టెడ్’ ఆపిల్స్ చాలామందిని ఆకర్షిస్తాయి. ధర ఎక్కువైనా విదేశీ పండు కాబట్టి ఆరోగ్యానికి మేలని భావించి చాలా మంది వాటినే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ అభిప్రాయంలో వాస్తవం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఆయన అపోలో హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్. ఆయన విదేశీ ఆపిల్ పండ్ల గురించి చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
‘విదేశీ ఆపిల్స్ కోసం ఎక్కువ ధర చెల్లిస్తున్నారంటే, తక్కువ పోషకాలు ఉన్న పండుకే అధికంగా ఖర్చు చేస్తున్నట్లే’ అని డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ కొండలు, కాశ్మీర్ లోయ ప్రాంతాల్లో పండే దేశీయ ఆపిల్స్లోనే అసలైన పోషక విలువలు అధికంగా ఉంటాయని ఆయన వివరించారు.
‘తాజాదనం’ వెనుక అసలు నిజం
విటమిన్-సి తగ్గుదల
విదేశాల నుంచి వచ్చే ఆపిల్స్ మెరిసేలా, తాజాగా కనిపిస్తాయి. కానీ ఆ మెరుపు వెనుక నిల్వ ప్రక్రియల ప్రభావం దాగి ఉంటుందని డాక్టర్ సుధీర్ చెబుతున్నారు. ఇవి వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి చేరుకుంటాయి. పైగా ‘కంట్రోల్డ్ అట్మాస్ఫియర్’ స్టోరేజ్లో నెలల తరబడి నిల్వ ఉంచుతారు.
విటమిన్-సి చాలా సున్నితమైన పోషక పదార్థం. 5 నుంచి 9 నెలలపాటు నిల్వ చేసిన ఆపిల్స్లో 40% నుంచి 85% వరకు విటమిన్-సి తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మన ఆఫిల్స్లోనే ఎక్కువ పోషకాలు
అదే సమయంలో హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చే దేశీయ ఆపిల్స్ తక్కువ కాలంలోనే మార్కెట్కు చేరుతాయి. అందువల్ల వాటిలోని సున్నితమైన పోషకాలు ఎక్కువగా నిల్వ ఉంటాయి.
దేశీయ ఆపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధి
మన దేశంలో పండే ‘రాయల్ డెలిషియస్’, ‘స్టార్క్రిమ్సన్’ వంటి రకాల ఆపిల్స్లో శరీరానికి మేలు చేసే బయో-యాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయని ఆయన తెలిపారు.
గుండె ఆరోగ్యం: ఫ్లోరిడ్జిన్, క్వెర్సెటిన్, కాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడంలో సహాయపడతాయి.
చక్కెర నియంత్రణ: ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో దోహదపడతాయి.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గింపు: కాశ్మీర్, హిమాచల్ ఆపిల్స్కు గాఢ ఎరుపు రంగు ఇచ్చే ఆంథోసైనిన్ అనే సమ్మేళనం కణాల నాశనాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మెరుపు చూసి మోసపోవద్దు
ఆపిల్స్పై మెరుస్తూ కనిపించే వ్యాక్స్ పూత లేదా ‘ఇంపోర్టెడ్’ స్టిక్కర్ను చూసి ఆకర్షితులవ్వొద్దని డాక్టర్ సుధీర్ కుమార్ సూచిస్తున్నారు. అసలైన పోషక విలువలు మన దేశంలోనే పండే తాజా ఆపిల్స్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. స్థానిక పండ్లు కొనడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. రవాణా దూరం తక్కువగా ఉండటంతో కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. అంతేకాకుండా మన దేశ రైతులకు మద్దతు లభిస్తుందన్నారు.
ఇక, రోజూ ఒక యాపిల్ తినడం మంచి అలవాటు అని చెప్పారు. అయితే అది నెలల తరబడి నిల్వ చేసిన విదేశీ పండుకన్నా.. మన నేలపై పండిన తాజా దేశీయ యాపిల్ అయితే ఇంకా ఉత్తమం అని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.