పులిహోర: వేడినీళ్లలో చింతపండు వేసి కొంతసేపు నానబెట్టి బాగా పిండి రసాన్ని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో చింతపండు రసం వేసుకోవాలి. అందులో కరివేపాకులు, పావు స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాల ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మరో పక్క పెద్ద గిన్నెలో వండిన అన్నాన్ని తీసుకుని పసుపు, ఒక స్పూను నూనె వేసి పొడిగా పొడిగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అందులో శెనగపప్పు, పల్లీలు, మిననప్పు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, కరివేపాకులు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఇప్పుడు అన్నంలో ముందుగా ఉడికించిన చింతపండు ఇగురు వేసి ఓసారి కలుపుకోండి. తరువాత కళాయిలోని తాళింపును కూడా వేసి కలుపుకోండి. అంతే టేస్టీ పులిహోర రెడీ అయినట్టే.
అల్లం గారెలు: ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న మినపప్పును నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బును ఒక గిన్నెలో వేసి ఉప్పు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు తరుగు వేసి కలుపుకోవాలి. స్టవ్ మద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక గారెలను వేసుకోవాలి. అంతే అల్లం గారెలు అమ్మవారి ప్రసాదానికి సిద్ధం.
పూర్ణం బూరెలు: కుక్కర్లో శెనగపప్పు, నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో నీళ్లు వేసి కాస్త పలుచగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న శెనగపప్పును మెత్తగా గరిటెతో కలుపుకోవాలి. ఆ శెనగపప్పులో బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని గట్టిగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఆ మిశ్రమం చల్లారాక చేత్తోనే బాల్స్ లా చుట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో బాల్స్ను మినపప్పులో మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ.
దద్దోజనం: ఒక గిన్నెలో తెల్ల అన్నాన్ని వేయండి. ఆ అన్నంలో పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అవసరం అయితే నీళ్లు కూడా వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కరివేపాకులు, మినపప్పు వేసి వేయించి… పెరుగు అన్నంపై వేయాలి. అంతే దద్దోజనం సిద్ధమైపోయింది.
శెనగల తాళింపు: కొమ్ము శెనగలను ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో వేసిఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ కొమ్ము శెనగలను ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి, ఉప్పు వేసి వేయించాలి. ఆ వేగాక ముందుగా ఉడికించుకున్న కొమ్ముశెనగలను వేసి కలుపుకోవాలి. శెనగల తాళింపు రెడీ అయిపోయింది.