రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యసహాయం అందించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం రహత్ పథకాన్ని ప్రారంభించింది. గత వారం అమల్లోకి వచ్చిన ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన తేదీ నుండి ఏడు రోజులపాటు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ చికిత్సకు దూరం కావొద్దని ప్రభుత్వ లక్ష్యం.
ఈ పథకం ప్రకారం అర్హులైన అన్ని రోడ్డు ప్రమాద బాధితులు ఎటువంటి నగదు చెల్లింపు లేకుండా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సమాచారం ప్రకారం.. భారత్లో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తొలి గంటలోపు ఆసుపత్రిలో చేర్పిస్తే దాదాపు 50 శాతం మరణాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్లైన్కు కాల్ చేస్తే సమీపంలోని గుర్తించిన ఆసుపత్రి వివరాలు, అంబులెన్స్ సౌకర్యం లభిస్తుంది. బాధితులు, సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా ఈ సేవను వినియోగించుకోవచ్చు.
రూ.1.5 లక్షల పరిమితిలో స్థిరీకరణ చికిత్స కూడా చేర్చారు. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటల వరకు, ప్రాణాంతక పరిస్థితుల్లో 48 గంటల వరకు తక్షణ చికిత్స అందిస్తారు. చికిత్స వివరాలు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్లో నమోదు చేస్తారు. పోలీసు ధృవీకరణకు లోబడి ఉంటాయి. ఈ పథకం అమలులో భాగంగా నేషనల్ హెల్త్ అథారిటీ TMS 2.0 వ్యవస్థ, ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (EDAR) వేదికలను అనుసంధానించారు. ఆసుపత్రులకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ (MVAF) ద్వారా 10 రోజుల్లోపు చెల్లింపులు జరగనున్నాయి. బీమా లేని లేదా హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యయాన్ని భరిస్తుంది. గోల్డెన్ అవర్లో వేగవంతమైన వైద్య జోక్యాల ద్వారా మరణాలను తగ్గించడమే ఈ పథక ప్రధాన లక్ష్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి