చెన్నైలో ట్యూటికోరిన్ తన భార్యను తల నరికి చంపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ను పోలీసులు శనివారం చెన్నైలో అరెస్టు చేశారు. అయితే హత్య గురించి మాట్లాడేందుకు అతను ఒక మీడియా చానెల్ను సంప్రదించిన కాసేపటికే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టుటికోరిన్ జిల్లాలోని తలవాయిపురం గ్రామానికి చెందిన తమిళ్ సెల్వన్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం ఉమామహేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై సెల్వన్కు అనుమానం వచ్చింది. ఆమె మరెవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుందా అని ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో గత నెల 31న ఇంట్లో తన భార్య ఉమా మహేశ్వరి (32)తో గొడవ పడ్డాడు. గొడవ కాస్త పెద్దది కావడంతో సహనం కోల్పోయి తన భార్యను అతి కిరాతకంగా తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత తమ తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తెను తీసుకొని వాళ్ల మామ ఇంటికి వెళ్లాడు. పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
అయితే రెండు రోజుల తర్వాత, తమిళ్ సెల్వన్ ఒక న్యూస్ ఛానెల్ కార్యాలయాన్ని సంప్రదించాడు. తన భార్య హత్య గురించి బహిరంగా మాట్లాడేందుకు సహకరించాలని వారిని కోరాడు. అది విన్న సదురు మీడియా ఛానెల్ ప్రతినిధులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే తేనాంపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరోకియా రవీంద్రన్కు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సెల్వన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ట్యూటికోరిన్ ఎస్పీ ఆల్బర్ట్ జాన్ మాట్లాడుతూ.. తమిళ్ సెల్వన్ గత కొంతకాలంగా భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని.. ఇందులో భాగంగానే అతని ఇంట్లో, ఇంటి భయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. తన భార్యపై అనుమానంతోనే సెల్వన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.